హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఒకవైపు కేంద్రం నుంచి అరకొర వ్యాక్సిన్ల సరఫరా, మరోవైపు ఎంత డబ్బయినా ఖర్చుచేసి కొనుగోలు చేద్దామన్నా అనుమతించని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు.. ఇవన్నీ కరోనా కట్టడిలో దూసుకుపోతున్న తెలంగాణకు అడ్డంకులుగా మారాయి. అందుకే సీఎం కేసీఆర్ దేశంలోనే తొలిసారి వినూత్న విధానానికి శ్రీకారంచుట్టారు. వ్యూహం ప్రకారం వ్యాక్సిన్లు వేయడంతో వైరస్వ్యాప్తిని త్వరగా కట్టడి చేయవచ్చన్న లక్ష్యంతో హైరిస్క్ గ్రూప్కు (జన సహాయకులు) మొదట వ్యాక్సిన్ విధానాన్ని పక్కాగా అమలుచేశారు. దీంతో వైరస్ వ్యాప్తి కట్టడికి ఇది ప్రధాన కారణంగా నిలిచింది. ఇప్పుడు దేశమంతటా వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ మోడల్ను అనుసరిస్తున్నది. ఇదే విషయాన్ని దేశంలోని ప్రముఖ వైద్యనిపుణుల సంఘాలు ప్రధాని మోదీకి వివరించాయి. తెలంగాణలో అనుసరిస్తున్న పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ (ఐపీహెచ్ఏ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఏపీఎస్ఎం), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడమాలజిస్ట్స్(ఐఏఇ) నివేదిక రూపంలో అందించాయి.
‘ఒకవైపు దేశంలో మహమ్మారి విజృంభిస్తున్నది. ఈ సమయంలో అన్ని వయస్సుల వారికి సామూహిక టీకా కార్యక్రమం ప్రారంభించడం కంటే, ఎక్కువ ప్రమాదంలో ఉన్నవారికి ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని వైద్య నిపుణులు తెలిపారు. క్రమపద్ధతి లేకుండా, అసంపూర్తిగా టీకాలు వేయడం వల్ల వైరస్ ఉత్పరివర్తనాలు పెరిగే అవకాశం ఉందని కరోనా వైరస్ నేషనల్ టాస్క్ఫోర్స్ సభ్యులు, ఎయిమ్స్ వైద్యులు సహా ప్రజారోగ్య నిపుణుల బృందం హెచ్చరించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అన్నిరంగాలకు ఒకేసారి ఇవ్వడంతో లక్ష్యంనెరవేరదని, దీనికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం హైరిస్క్ వర్గాలను గుర్తించి ప్రాధాన్యక్రమంలో వ్యాక్సిన్ ఇస్తున్నదని పేర్కొన్నది.
రేషన్ డీలర్లు, వర్కర్లు, ఎల్పీజీ డీలర్లు, వర్కర్లు, పెట్రోల్ బంకు వర్కర్లు, ఎఫ్సీఐ వర్కర్లు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల వర్తకులు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, రైతుబజారు వ్యాపారులు, కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం వ్యాపారులు, లిక్కర్షాపు సిబ్బంది, ఆర్ఎంపీలు, కిరాణ దుకాణదారులు, వీధి వ్యాపారులు, ఐరన్, లాండ్రీ వర్కర్లు, మెడికల్ షాపు వర్కర్లు, చిన్నహోటళ్ల వర్కర్లు, శ్మశానవాటికల్లో పనిచేసేవారు, ఆటోడ్రైవర్లు, నీళ్లు, పాలు, పేపర్ డెలివరీచేసేవారితో పాటు ఇతర దీర్ఘకాలిక రోగులు.
దేశంలో ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రానికి, మిగిలిన 50 శాతంలో 25 శాతం ప్రైవేటు దవాఖానలకు, 25 శాతం రాష్ర్టాలకు ఇవ్వాలన్నది కేంద్రం నిబంధన. ఇది కరోనా కట్టడిలో ముందంజలో ఉన్న తెలంగాణ వంటి రాష్ర్టాలకు ప్రతిబంధకంగా మారింది. టీకాలు వేయాల్సిన వారి సంఖ్య ఎక్కువ, రాష్ర్టానికి వచ్చే టీకాల సంఖ్య మాత్రం తక్కువ. ఎంత ఖర్చయినా వెనకాడకుండా సొంతంగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. కానీ, కేంద్రం విధానాలు దీన్ని విజయవంతం కాకుండాచేశాయి. ఇలాంటి సమస్యలు అనేకం ఎదురవుతాయని, ఏకకాలంలో అందరికి వ్యాక్సినేషన్ సాధ్యంకాదని గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రాధాన్యవర్గాలుగా విభజించారు. నిత్యం ప్రజలతో సంబంధం ఉన్నవారు, వైరస్కు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే 30 లక్షలకుపైగా గుర్తించి, తొలి ప్రాధాన్యంగా వీరికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. వీరందరికి అత్యంత వేగంగా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తి కట్టడి సాధ్యమైంది. సీఎం కేసీఆర్ చేసిన ఈ ఆలోచన ఇప్పుడు దేశంలోని అన్నిరాష్ర్టాలకు మార్గదర్శిగా మారింది.