నల్లగొండ, మార్చి 2 : కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానాను నింపేందుకు అన్ని దారులను వెతుకున్నది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కుతున్నది. ఎల్ఆర్ఎస్ పేరుతో మూడేండ్ల కింద దరఖాస్తులను స్వీకరించిన గత ప్రభుత్వం పలు కారణాలతో పక్కకు పెట్టిగా, వాటిని పరిష్కరించి ఆదాయం పొందాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నది. అందులో భాగంగానే మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటి పొజిషన్ నివేదించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
ఈ నెలాఖరుకులోగా నివేదిక సిద్ధం చేయాల్సి ఉండగా మున్సిపల్ యంత్రాంగం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో పడింది. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతోపాటు వెయ్యి రూపాయల రుసుం తీసుకుంటున్న సమయంలో.. ఎవరూ ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవద్దని, తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేడు 14 శాతం రుసుం వసూలు చేసి లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ రెగ్యులరైజ్ చేసే పనిలో పడడం గమనార్హం.
అనధికార లే అవుట్లు, ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకుని క్రమబద్ధీకరణ కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పేరుతో దరఖాస్తులు స్వీకరించి క్రమబద్ధీకరణ చేస్తుంది. 2015 లోనే కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 20వేల దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించగా పెండింగ్లో ఉన్న వాటి కోసం 2020 ఆగస్టు నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తులను స్వీకరించింది. కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం అప్పట్లో ఈ ప్రక్రియను నిలిపివేసింది. తాజాగా ఆ దరఖాస్తులను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ యంత్రాంగాన్ని ఆదేశించిం ది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యదాద్రి భువనగిరి పరిధిలోని19మున్సిపాలిటీల్లో నందికొండ మినహా అన్ని చోట్లా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన మొదలైంది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2.54 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, ఈ నెల 31 పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు అధికార యంత్రాంగం చెప్తున్నది. ఇందుకు ప్లాట్ యజమానుల నుంచి 14 శాతం రుసుమును ప్లాట్ రెగ్యులరైజ్ చేయనున్నట్లు తెలిపింది. సాధారణంగా కొనుగోలు చేసిన ప్లాట్లకు ఏడు శాతం స్టాంప్ డ్యూటీ చెల్లిస్తుండగా ఇక్కడ మాత్రం 14 శాతం చెల్లించాల్సి ఉంది. కొన్ని పట్టణ శివారు ప్రాంతాల్లో ఈ రుసుం విలువ కంటే కూడా ప్లాట్ల విలువ తక్కువగా ఉన్నట్లు ప్లాట్ల యజమానులు వాపోతున్నారు.
గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలు పరిశీలించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నల్లగొండలో 34వేల దరఖాస్తులు ఉన్నందున వాటి యజమానులను కలిసి పరిశీలిస్తున్నాం. అనంతరం ప్రభుత్వ ఆదేశానుసారం రిజిస్ట్రేషన్ విలువలో 14 శాతం రుసుం తీసుకుని రెగ్యులరైజ్ చేస్తాం. అందుకు సంబంధించిన ఆదేశాలు ఇంకా రాలేదు.
– సయ్యద్ ముస్తాఫా అహ్మద్, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ