నేరేడుచర్ల, సెప్టెంబర్ 14 : ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తున్నది. ఎలక్షన్ను ప్రశాంతగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మొదటగా ఓటరు జాబితాను సరిచేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో 18ఏండ్లు నిండిన యువత ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
18ఏండ్లు నిండిన యువతీ, యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఈ నెల 19వరకు అవకాశం కల్పించింది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ఓటరు జాబితాలో తప్పులను సవరించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మృతి చెందిన వారి పేర్లు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి వివరాలను తొలగిస్తూ కొత్త ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నారు. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితా సవరణ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటు లేదని, గల్లంతైందని, ఓటు వేసే బూత్ మారిపోయిందని ఇబ్బందులు పడే బదులు ఈసీ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. తమ పేరు, తమ కుటుంబ సభ్యుల పేర్లు సరిగా ఉన్నాయా? ఏ బూత్లో ఓటు వేయాలి? అనే విషయాలను ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. పేర్లు, చిరునామాల్లో తప్పులుంటే సరి చేసుకోవాలంటున్నారు.
ఫారం -6 : కొత్తగా ఓటు నమోదు కోసం ఈ ఫారం నింపి సంబంధిత అధికారులకు ఇవ్వాలి.
ఫారం-7 : ఈ ఫారం ద్వారా ఓటు తొలగించుకోవచ్చు. మృతిచెందిన, శాశ్వతంగా వలస వెళ్లి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు, వివాహమై వెళ్లినవారు దీనిని నింపి మార్పు చేసుకోవచ్చు.
ఫారం-8 : ఈ ఫారంతో సవరణకు అవకాశం ఉంటుంది. ఫొటో, పేరు, చిరునామా తదితర మార్పులు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఫారం-8ఏ : నియోజకవర్గ పరిధిలోని ఒక బూత్ నుంచి మరో బూత్లోకి ఓటు మార్చుకునేందుకు ఈ ఫారం ఉపయోగపడుతుంది.
18 ఏండ్లు నిండినవారు, జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు సమీపంలోని బీఎల్ఓలను సంప్రదించాలి. కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. బీఎల్ఓల వద్ద అన్ని రకాల ఫారాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా కలెక్టర్, ఆర్డీఓ, తాసీల్దార్, మున్సిపాలిటీ కార్యాలయాల్లోనూ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా ఓటరుగా పేరు నమోదు, సవరణ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం www.ceotelangana. nic.in వెబ్సైట్ను సంప్రదించాలి.