సూర్యాపేట జిల్లా కేంద్రంలో వచ్చే నెల 2న ఐటీ హబ్ అందుబాటులోకి రానున్నది. దీనిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తోపాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కొలువుల భర్తీ కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. సూర్యాపేటలోని మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న ఉద్యోగ మేళాకు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండి ఇండియా, అమెరికా, కెనడా తదితర దేశాల్లో నడుస్తున్న ట్రయామ్ టెక్నాలజీ, నియో ప్రిస్మ్, సెంటిప్రోస్, భారత్క్లౌడ్, మోలినా టెక్నాలజీస్తోపాటు మొత్తం 17 ఐటీ కంపెనీలు జాబ్మేళాకు వస్తున్నాయి. స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వనుండగా ఇప్పటికే 4వేల మంది ఉద్యోగార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తొలి దశలో 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. రహదారుల విస్తరణతోపాటు భారీ ప్రభుత్వ భవనాలు నిర్మాణమయ్యాయి. అన్నీ సమకూరుతుండడంతో అనేక పేరున్న విద్యా సంస్థలతోపాటు డీ మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, జియో మార్ట్లతోపాటు మహానగరాలకే పరిమితమైన పెద్ద పెద్ద కార్పొరేట్ షోరూమ్లు సైతం పదికి పైనే సూర్యాపేటకు వచ్చాయి. దాంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో త్వరలో ప్రారంభం కానున్న ఐటీ హబ్తో మరింత మందికి ఉపాధి లభించనుంది. సూర్యాపేట ప్రాంతంలో ఇంజినీరింగ్ చదివిన విద్యాధికులు ఎక్కువగా ఉండడంతో జిల్లాకు ఐటీ హబ్ తీసుకొస్తానని గత ఎన్నికల్లో మంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు రెండేండ్లుగా అమెరికాతోపాటు ఇతర దేశాల్లో ఉన్న ఐటీ కంపెనీ ప్రతినిధులతో చర్చలు చేసి సూర్యాపేటలో సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రారంభించాలని ఆహ్వానించారు. దాంతో దాదాపు పది కంపెనీలు ఇక్కడ తమ బ్రాంచ్లు ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఫలితంగా స్థానిక ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభించబోతున్నాయి.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్లో మంగళవారం ఐటీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండి ఇండియా, అమెరికా తదితర దేశాల్లో నడుస్తున్న ట్రయామ్ టెక్నాలజీ, నియో ప్రిస్మ్, సెంటీప్రొస్, భారత్ క్లౌడ్, మోలినా టెక్నాలజీస్, సిస్టెక్ క్రాప్, లూసిడ్ టెక్నాలజీస్, విక్లౌడ్ గ్లోబల్ వంటి 17 సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. జాబ్మేళాకు ఇప్పటికే 4వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐటీ ఉద్యోగాల కోసం ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు చేసి 300 నుంచి 400 మంది అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నాయి. ఎంపికైన వారికి ఇక్కడే శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నాయి. సూర్యాపేటలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడంతోపాటు స్థానికులకు ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తుండడం పట్ల ఇంజినీరింగ్ పూర్తి చేసిన, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు