తిరుమలగిరి, జూలై 19 : తిరుమలగిరి మండలంలో మట్టి మాఫియా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. అక్రమంగా మట్టి తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. గుట్టలు, పుట్టలు, ఎస్సారెస్పీ కాల్వలు, ప్రభుత్వ భూములు, బోడ్లు ఏదీ వదలడం లేదు. వెంచర్లు, ఇండ్లకు మట్టి తరలిస్తూ అడ్డూ అదుపు లేకుండావ్యాపారం కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్ మట్టి రూ. 600, టిప్పర్కు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో నిరంతరం కొనసాగుతున్నా అధికారులు పట్టించు కోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలంలోని మామిడాల గ్రామంలోని ఎర్రబోడులో నెలరోజులుగా అక్రమంగా మట్టిని తరలించారు. సోమవారం రైతులు అడ్డుకోవడంతో అధికారులు నిలిపివేయగా, ఎస్సారెస్పీ కాల్వల గట్టు మట్టి అక్రమ తరలింపు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నది. మామిడాల గ్రామ సర్వే నంబర్ 107లో 49 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ప్రభుత్వం నలుగురు రైతులకు 6 ఎకరాల 10 గుంటలకు పట్టాలు ఇచ్చింది. మిగులు 42 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. దీన్ని అధికారులు సర్వే చేసి హద్దురాళ్లు గుర్తించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
ఐదెకరాలకు పైగా అన్యాక్రాంతం
ఎర్రబోడు చుట్లూ ఇప్పటికే ఐదు ఎకరాలకు పైగా భూమి అన్యాక్రాంతమైంది. ఇక్కడ ఎకరం దాదాపు రూ.15 లక్షలు పలుకుతున్నది. ఇంత విలువైన భూములను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఆక్రమణకు గురైన భూమిని గుర్తించి హద్దులు నిర్ణయించాలని కోరుతున్నారు.
ఎస్సారెస్పీ కాల్వలది ఇదే పరిస్థ్దితి..
మట్టి మాఫియా ఎస్సారెస్పీ కాల్వలను కూడా వదలడం లేదు. కాల్వల నుంచి యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం కాల్వ గట్టు వద్ద మట్టి తీయాలంటే నీటిపారుదల శాఖ అనుమతి తీసుకుని డీడీ కట్టాలి. కానీ అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్నారు. కాల్వలకు గండి పడితే కనీసం గండ్లు పూడ్చడానికి కూడా లేకుండా తోడేస్తున్నారు. 69 డీబీఎం కాల్వ పరిధిలో ఇది జరుగుతున్నది. నీటి పారుదల శాఖ అధికారులు కాల్వల పరిధిని నిర్ణయించి హద్దురాళ్లు ఏర్పాటు చేసి ఎస్సారెస్పీ కాల్వల గట్లు అక్రమణ, అక్రమ మట్టి రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.