హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): సాగు ఖర్చులు పెరుగుతుండటం, వ్యవసాయ కూలీల సంఖ్య తగ్గిపోతుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకు తెర దించేందుకు ఇక్రిశాట్ ఇంక్యుబేషన్ సెంటర్లోని ఎక్స్ మెషీన్ స్టార్టప్ నడుం బిగించింది. వ్యవసాయ ఉపకరణాలను తయారు చేయడంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ సంస్థ.. పొలాల్లో పనులు చేయగలిగే ఎక్స్100, ఎక్స్100 మ్యాక్స్, ఎక్స్ 100 అల్ట్రా పేరుతో మూడు రకాల రోబోలను అందుబాటులోకి తెచ్చింది.
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ తో పనిచేసే ఈ రోబోలు పొలాల్లో విత్తనాలు నాటడం మొదలుకొని పంట నూర్పిడి దాకా సేవలందించగలవు. వాణిజ్య పంటలతోపాటు ఉద్యాన పంటల సాగుకు అవసరమైన పనులను చేయగలిగేలా రూపొందించిన ఈ రోబోలను ఇటీవల షార్క్ ట్యాంక్ వేదికపై ప్రదర్శించినట్టు ఇక్రిశాట్ వర్గాలు తెలిపాయి.