హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు బుధవారం నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 17 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. స్థానికంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. తొలిరోజు ఆయన మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్షోలలో పాల్గొంటారు. అంతకుముందు బుధవారం మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్లోని తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి, అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరనున్నారు. కేసీఆర్ తొలుత నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకొని, అక్కడ రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి, అక్కడ కూడా రోడ్షో నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం భువనగిరికి చేరుకొని, సాయంత్రం రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి అక్కడే బస చేస్తారు. కేసీఆర్ ప్రయాణించే బస్సును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మంగళవారం తెలంగాణభవన్లో బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు. రోడ్షోలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు దాదాపు వంద మందికిపైగా వలంటీర్లు వెన్నంటి ఉంటారు. ఉద్యమ నాయకుడిగా పాదయాత్ర, సైకిల్యాత్ర, బస్సుయాత్రలు చేసిన కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా బస్సుయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో బస్సుయాత్రను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడం, సరియైన నీటి నిర్వహణ లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం, కరెంటు సరఫరా సరిగా లేకపోవడంతో మోటర్లు కాలిపోతుండటం, ధాన్యానికి రూ.500 బోనస్ అమలు చేయకపోవడం, ఆసరా పింఛన్దారులకు రూ.4 వేలు ఇవ్వకపోవడం, మహిళలకు ప్రతి నెలా రూ.2,500 హామీని అమలుచేయకపోవడం తదితర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ దృష్టిసారించనున్నట్టు సమాచారం.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం ఎనిమిది సీట్లు గెలుస్తుందని, కొంచెం కష్టపడితే మరో మూడు స్థానాల్లో విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తే, రెండు అంకెల స్థానాలు గెలుచుకోవడం సాధ్యమేనని గుర్తించిన గులాబీ బాస్ ఆ దిశగా కార్యాచరణ రూపొందించారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను ముందే ప్రకటించి, నియోజకవర్గాలు, మండలాలవారీగా సమావేశాలు నిర్వహించడం కూడా పూర్తయ్యింది. ఒకవైపు రోడ్షోలకు తోడుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.
కేసీఆర్ 17 రోజుల టూర్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలో కలవరపాటు నెలకొన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణానికి, కేసీఆర్ పర్యటన అనంతరం రాజకీయ సమీకరణల్లో స్పష్టమైన తేడా ఉంటుందని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ విడుదల చేసిన టూర్ షెడ్యూల్ ప్రకారం.. సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతోపాటు రామగుండం, కొత్తగూడెం, వీణవంక ప్రాంతాల్లోనూ కేసీఆర్ బస చేయనున్నారు. కేసీఆర్ పాల్గొనే ఒక రోడ్షోకు, మరో రోడ్షోకు మధ్య దాదాపు 10 నుంచి 12 గంటల సమయం ఉంటుంది. ఉద్యమ సమయంలో తెలంగాణ అంగుళం, అంగుళం కలియతిరిగిన కేసీఆర్కు పార్టీలు, వర్గాలకు అతీతంగా ప్రతి పట్టణంలో కనీసం 100 నుంచి 200 మందిని పేరుపెట్టి పిలిచేంత చనువు ఉన్నదని, వారంతా ప్రభావిత వర్గాలకు ప్రతినిధులని, వారి మీద కేసీఆర్ బస్సుయాత్ర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ‘మా ప్రాంతానికి చాలా రోజుల తరువాత సారొస్తున్నరు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. సారు మేం కలిసి మా కష్టసుఖాలు చెప్పుకుంటాం’ అని మహబూబాబాద్కు చెందిన పార్టీ కార్యకర్త పేర్కొనడం గమనార్హం. ‘తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్కు ఆప్తమిత్రులు ఉన్నారు. వారికి రాజకీయ పార్టీలతో పనిలేదు. తెలంగాణ సమాజహితమే వారికి ముఖ్యం. అటువంటివారు అనేకమంది కారణాంతరాల వల్ల కాస్త దూరంగా ఉన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తున్నారని తెలియగానే అందరిలో సంతోషం కలిగింది’ అని ఉద్యమ సమయంలో కేసీఆర్తో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగి ఒకరు పేర్కొనడం విశేషం. మరోవైపు, కేసీఆర్ తమ ప్రాంతంలోనే బసచేయడమే కాకుండా ఎక్కువ సమయం ఉండటం వల్ల తమ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందని, దీనితో తమ గెలుపు ఖాయమైపోయినట్టేనని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ చేసే దిశానిర్దేశం ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేస్తుందనే ధీమా బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.
కేసీఆర్ 17 రోజులపాటు చేపట్టనున్న బస్సుయాత్ర, రోడ్షోలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కేసీఆర్ తలపెట్టిన పర్యటనను బస్సుయాత్ర, రోడ్షో, జనయాత్ర .. పేర్లతో పిలుస్తున్నారు. ‘కేసీఆర్ ఏం చేసినా సంచలనమే.. ’ అన్నట్టుగా రెండున్నర దశాబ్దాలుగా ఆయన చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. 2003 మార్చి 27న రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ ఆకాంక్ష హస్తినను బలంగా తాకాలన్న తలంపుతో హైదరాబాద్ నుంచి 1,000 కార్లతో ఢిల్లీకి కారు ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మార్గమధ్యంలో ఉన్న అన్ని రాష్ర్టాల్లోని ప్రజలకు, పార్టీలకు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తెలియపరచాలనే లక్ష్యంతో చేపట్టిన ఆ యాత్ర దేశంలో సంచలనం సృష్టించింది.