‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ సరఫరా ఉండదు. రాష్ట్రం అంధకారం అవుతుంది’ అని నాటి సమైక్య పాలకులు చేసిన దురహంకార వ్యాఖ్యలకు చెంపపెట్టులా నేడు తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను పటిష్టంగా మార్చడంతో నేడు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతున్నది. వేసవిలోనూ ఆటంకం లేకుండా ప్రజల అవసరాలను తీర్చుతున్నది. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందుతున్నది. సాగుకు నాడు 3.11 లక్షల నుంచి నేడు 4.82 లక్షలకు విద్యుత్ కనెక్షన్ల పెరిగినా ఏ సమస్యా రావడం లేదు. దళితులు, గిరిజనులకు గృహ అవసరాల కోసం 101 యూనిట్లు.. నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తున్నది. ఇలా అనేక విధాలుగా విద్యుత్ సరఫరాను విజయవంతంగా అమలు చేస్తూ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిదేండ్లలో వేల కోట్ల రూపాయలతో విద్యుత్ అభివృద్ధి పనులు చేపట్టారు. సబ్స్టేషన్లు కేవీ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ అందించడానికి రూ.30వేల కోట్లతో దామరచర్ల మండలం వీర్లపాలెంలో 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం విద్యుత్ దినోత్సవం నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.
నల్లగొండ సిటీ, జూన్ 4 : రాష్ట్రం అభివృద్ధి స్థాయిని కొలిచే అత్యంత ముఖ్య సూచికల్లో విద్యుత్ వినియోగం ఒకటి. విద్యుత్ మౌలిక సదుపాయాల్లో అత్యంత కీలకం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఎండాకాలంలో అసలే చెప్పలేని పరిస్థితి. కరెంట్ కోసం కొట్లాడితే నాడు బషీర్ బాగ్ వద్ద ఆందోళనకారులపై కాల్పులు జరిపించిన ఘనత నాటి పాలకులది. కానీ స్వరాష్ట్రంలో మాత్రం కరెంట్ గోస తీరింది. సీఎం కేసీఆర్ దూర దృష్టితో రాష్ట్రం ఆవిర్భవించిన ఆరు నెలల్లోనే 24 గంటల కరెంట్ అందుబాటులోకి తెచ్చి చరిత్ర సృష్టించారు. ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు హాయిగా పనులు చేసుకోగలుగుతున్నారు. పారిశ్రామిక రంగానికి నిరంతరాయ విద్యుత్తో అభివృద్ధి పరుగులు పెడుతున్నది.
అంతరించిపోతున్న కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలిచింది. గత పాలకుల కాలంలో నిర్లక్ష్యానికి గురైన నాయీబ్రాహ్మణులు, రజక వృత్తులకు జీవం పోసింది. సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత కరెంట్ను అందిస్తున్నది. నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నది.
నల్లగొండ జిల్లాలో 10,738 మంది రజక కుటుంబాలకు రూ.3.24కోట్లతో, 3228 మంది నాయీబ్రహ్మణ కుటుంబాలకు రూ.89.11 లక్షలతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ దళిత, గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఎలాంటి చార్జీలు లేకుండా కరెంట్ను అందిస్తున్నది. అర్హులైన ఇంటికి నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను సరఫరా చేస్తున్నది. 2018 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. రెవెన్యూ అధికారులు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రంతో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 10 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతమైన దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో రూ.30వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం 4వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మిస్తున్నది. నాలుగేళ్లుగా ప్లాంట్ నిర్మాణ పనులు నిర్విరామంగా కొనసాగుతుండడంతో ఈ సంవత్సరం చివరి నాటికి 2800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, 2024 డిసెంబర్ నాటికి 3300 విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మూడు యూనిట్ల పనులు పూర్తి కానున్నాయి.
గతంలో ఆరు మెగావాట్ల యూనిట్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగం జరిగేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నల్లగొండ జిల్లాలో సుమారు రోజుకు 15 మిలియన్ మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారు. 24 గంటలపాటు అంతరాయం లేకుండా విద్యుత్ను అందిస్తున్నారు. దాంతో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా విద్యుత్ వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది.
తెలంగాణ ఏర్పడక ముందు రైతులు కరెంటు కష్టాలు అనుభవించారు. రోజుకు కనీసం 3 నుంచి 4 గంటల కరెంటు కూడా రాకపోయేది. దాంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. వచ్చే కరెంటు కూడా లోఓల్టేజీ కావడంతో మోటర్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. వాటి మరమ్మతుల కోసం రైతులు తామే సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది. ఈ కష్టాలన్నింటికీ తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతకు అండగా నిలుస్తున్నది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 2.21 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుతున్నది. తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో 1.46 వ్యవసాయ కనెక్షన్లు ఉంటే ప్రస్తుతం రెండింతలయ్యాయి.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ దినోత్సవం నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వెయ్యి మందికి తగ్గకుండా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని చర్చించనున్నారు. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లు, ఇతర విద్యుత్ కార్యాలయాలను ఇప్పటికే లైటింగ్లతో ముస్తాబు చేశారు. 21 రోజులపాటు లైటింగ్ ఉండనున్నది. ప్రతి గ్రామంలో విద్యుత్ పరిస్థితిపై నాడు- నేడు పరిస్థితపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ రంగంలో ప్రగతిని ప్రత్యేకంగా బుక్లెట్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
నల్లగొండ జిల్లాలో ప్రస్తుత వేసవిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 18 మిలియన్ వాట్స్ విద్యుత్ను ప్రజలు వినియోగించారు. అయినప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా గృహ వినియోగంతోపాటు పరిశ్రమలు, వ్యవసాయానికి నిరంతరాయంగా కరెంట్ను అందిస్తున్నాం. వేసవిలో ఈదురు గాలులు, వర్షాలు అధికంగా వచ్చినాఆ విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం.
– మదన్మోహన్, ట్రాన్స్కో ఎస్ఈ నల్లగొండ