రామగిరి, ఏప్రిల్ 3 : పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,497 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 40,381 మంది హాజరయ్యారు. 116 మంది విద్యార్థులు గౌర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఈఓలు తనిఖీ చేశారు. వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఆలస్యంగా వచ్చి వెనుదిరిగిన ఘటనలు ఉమ్మడి జిల్లాలో నమోదు కాలేదు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సెయింట్ ఆల్ఫెన్స్ స్కూల్ కేంద్రాల్లో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి, డీఈఓ బి. భిక్షపతి, ఫ్లైయింగ్ స్వాడ్ బృందాలు తనిఖీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట, వలింగొడలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి, డీఈఓ నారాయణరెడ్డి పర్యవేక్షణ చేశారు.
వార్షిక పరీక్షలకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వచ్చే ముందు తల్లిదండ్రులతో కలిసి వెళ్లి ఆలయాల్లో పూజలు చేయడం కనిపించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసీనగర్, వీటీకాలనీ సెంటర్లోని హనుమాన్ దేవాలయంతోపాటు పలు ఆలయాల్లో ఉదయం విద్యార్థుల సందడి నెలకొంది. అనంతరం విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకొచ్చి ఆల్దబెస్ట్ చెబుతూ లోపలికి పంపించారు.