ఆత్మకూర్.ఎస్/ నార్కట్పల్లి/మునుగోడు, మార్చి 6 ;విద్యార్థి దశలో కీలకమైన మలుపు పదో తరగతి. అలాంటి పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 11 వరకు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో గతంలో కంటే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధనతోపాటు విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేయడం, చదువులో వెనుకబడిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యాస దీపికలను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమంలో రూపొందించి పంపిణీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీఈఆర్టీ నిపుణుల బృందంతో తయారీ..
ఒక్కో విద్యార్థికి గణితం, సాంఘిక, జీవ, భౌతిక శాస్ర్తాలకు సంబంధించి అభ్యాస దీపికలను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(SCERT) విషయ నిపుణుల బృందంతో తయారు చేయించారు. వీటిలో లఘు, బహుళైచ్చిక ప్రశ్నలు, జవాబులు రూపొందించారు. విద్యార్థులు స్వీయ అభ్యసనం ద్వారా ముఖ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోడానికి ఈ దీపికలు ఎంతో ఉపయోగపడుతాయి. వీటిని విద్యాప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. తరగతి గదిలో వర్క్షీట్ సాధించడం ద్వారా పొందిన జ్ఞానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇవి దోహదపడుతాయి.
నకిరేకల్ నియోజకవర్గంలో 1,703 మంది విద్యార్థులు నకిరేకల్ నియోజకవర్గంలో 10వ తరగతి విద్యార్థులు 1,703 మంది ఉన్నారు. కేతేపల్లి-186, నకిరేకల్-261, కట్టంగూర్-272, నార్కట్పల్లి-323, చిట్యాల-352, రామన్నపేట-309 పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. వీరందరికీ కరదీపికలు అందజేశారు.
సులభంగా అర్థమయ్యేలా..
ఉపాధ్యాయులు, విద్యార్థులు భాషేతర పాఠ్యాంశాల్లోని ప్రధాన భావాలను సులభతరం చేయడానికి అభ్యాస దీపికలు దోహదపడనున్నాయి. విద్యార్థులు స్వీయ అభ్యాసంతో అన్ని ముఖ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా విద్యా ప్రమాణాల అధారంగా ప్రభుత్వం వీటిని రూపొందించింది.
ఆత్మకూరు.ఎస్, మండలంలో 448 మంది..
ఆత్మకూర్.ఎస్.మండలంలో 448 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుండగా, 284 మంది బాలురు, 164 మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ కరదీపికలు అందించారు.
సులభంగా అర్థమయ్యే రీతిలో ఉన్నాయి
అభ్యాస దీపికలు ఎంతో సులభంగా, అర్థమయ్యే రీతిలో ఉన్నాయి. ప్రతి పాఠంపై ముఖ్యమైన ప్రశ్నలు, బిట్లను రూపొందించారు. వీటి ద్వారా వార్షిక పరీక్షల్లో ప్రశ్నలు ఏవిధంగా అడుగుతారో తెలిసింది. వీటిని ఉపయోగించుకొని మంచి మార్కులు పొందుతా.
–గుండాల సునంద, పాతర్లపహాడ్, ఆత్మకూరు.ఎస్
సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వడం సంతోషకరం
గణితం, సాంఘీక, జీవ, భౌతికశాస్ర్తాలకు వేర్వేరుగా అభ్యాస దీపికలు ఇవ్వడం సంతోషకరం. ఇవి ఎంతో స్పష్టంగా అర్థమవుతున్నాయి. పాఠ్యపుస్తకాల్లో ఉన్న సారాంశం వీటిల్లో ఉంది. కాబట్టి వార్షిక పరీక్షలకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. వీటిని వినియోగించుకొని 10 జీపీఏ సాధిస్తాననే నమ్మకం కలిగింది.
-గుండెబోయిన అక్షయ, చిన్న నారాయణపురం
మంచి ఫలితాలకు దోహదం
పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు ఈ అభ్యాస దీపికలు ఎంతగానో దోహదపడుతాయి. వార్షిక పరీక్షల్లో ప్రతి సబ్జెక్టు నుంచి ఎలాంటి ప్రశ్నలు, బిట్లు వస్తాయనే ప్రధాన అంశాలతో ఉపాధ్యాయ నిపుణులు వీటిని రూపొందించారు. విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో వీటితో అవగతమవుతుంది.
-దారాసింగ్, ఎంఈఓ, ఆత్మకూర్.ఎస్