– నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు
నల్లగొండ, ఆగస్టు 31 : నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి పదేండ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ప్రకటించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 2020 సెప్టెంబర్ 8న డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికకు సంబంధించిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ప్రతాప్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మూడవత్ మల్లేష్పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కేసు దర్యాప్తులో పోలీసు అధికారులు కీలక ఆధారాలను సేకరించి నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు.
కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం నిందితుడు మూడవత్ మల్లేష్ ను దోషిగా తేల్చుతూ 10 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అదే సమయంలో రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తులో అప్పటి ఎస్హెచ్ఓ ఎం.రాములు, అప్పటి సీఐ డి.వెంకటేశ్వర్లు, ప్రస్తుత ఎస్హెచ్ఓ సిహెచ్.బాలకృష్ణ, ప్రస్తుత సీఐ కే.బీసన్న, సీడీఓ పి.లింగయ్య, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితరులు సహకరించారు.