సూర్యాపేట రూరల్/అర్వపల్లి, జూలై 31 : నాటిన ప్రతి మొక్కనూ బాధ్యతగా సంరక్షించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సూర్యాపేట మండలం సూర్యాపేట -జనగాం, నకిరేకల్-తానంచర్ల జాతీయ రహదారుల వెంట నాటిన మొక్కలను శనివారం ఆయన పరిశీలించారు. ఆయా రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. ప్రతి మొక్కకూ ట్రీగార్డును ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీపీఓ యాదయ్య, ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాస్రావు, ఏపీఓ వెంకన్న సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
4న రోడ్డు విస్తరణపై సమావేశం
అర్వపల్లి : మండలకేంద్రంలో రెండేండ్లుగా కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసి పూర్తిచేయడం కోసం ఈ నెల 4న మండల కేంద్రంలో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. సూర్యాపేట-జనగాం, నకిరేకల్-తానంచర్ల జాతీయ రహదారుల కూడలి విస్తరణ పనులు నిలిచిపోవడంతో వరద నీరంతా ఇండ్ల మధ్యలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రహదారి కాంట్రాక్టర్లతో కలిసి సభ నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణకు గ్రామస్తులు సహకరించాలని కోరారు.
మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు స్థల పరిశీలన
తుంగతుర్తి : మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు తుంగతుర్తి -వెలుగుపల్లి సరిహద్దు ప్రాంతంలో దేవాదాయ శాఖకు సంబంధించిన పది ఎకరాల భూమిని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేయిస్తానన్నారు. ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, ఏపీడీ సురేశ్, తాసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ లక్ష్మి, ఏపీఓ వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, సర్పంచులు వెంకన్న, రాంచంద్రారెడ్డి, శ్రీను, సంకినేని రవీందర్ పాల్గొన్నారు.