ఉక్రెయిన్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు
వైద్య విద్య కోసం వెళ్లిన పలువురు
రష్యా మిలటరీ యాక్షన్తో తల్లిదండ్రుల ఆందోళన
యుద్ధ దృశ్యాలను చూసి కలవరపాటు
విమాన సర్వీసుల నిలిపివేతతో అక్కడే చిక్కుకుపోయిన విద్యార్థులు
యాదాద్రి, ఫిబ్రవరి 24 : ఉక్రెయిన్పై రష్యా యద్ధం ప్రపంచ దేశాలను దాటి ఉమ్మడి జిల్లాలోనూ వణుకు పుట్టిస్తున్నది. వైద్య విద్య కోసం నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి ఉక్రెయిన్కు వెళ్లిన విద్యార్థులు పలువురు విమాన సర్వీసుల నిలిపివేతతో అక్కడే చిక్కుకుపోయారు. టీవీలు, సోషల్ మీడియాలో క్షిపణి దాడులు, బాంబు పేలుళ్ల దృశ్యాలను చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డలను స్వదేశానికి క్షేమంగా తీసుకురావాలని ప్రాధేయపడుతున్నారు.యాదగిరిగుట్టకు చెందిన గంజి భానుప్రసాద్, ముడుంబై శేష ఫణిచంద్ర ఉక్రెయిన్లోని జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో, మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ తమ్ముడు అజయ్ అక్కడి కార్కివ్ నేషనల్ యూనివర్సిటీలో మెడిసిన్ చేస్తున్నారు. రష్యా బలగాల మోహరింపు నేపథ్యంలో బుధవారం సాయంత్రమే ఇండియాకు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. కాగా, యుద్ధం మొదలై ఎయిర్ స్పేస్ రద్దవడంతో అక్కడే ఆగిపోయారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లోనే తలదాచుకున్నారు. తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను వివరిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్నారు. గంజి భాను ప్రసాద్, ముడుంబై శేష ఫణిచంద్ర ఉక్రెయిన్లోని జఫ్రోజియా వైద్య యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో గురువారం ఉదయం ఇండియాకు వచ్చేందుకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్ పోర్టుకు రాగా రష్యా బలగాలు దాడిచేశాయి. విమానాలు రద్దు కావడంతో యూనివర్సిటీలో క్షేమంగా తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు వారితో వాట్సాప్ కాల్ మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మార్కెట్ వీధికి చెందిన ముడుంబై రామకృష్ణాచార్య, రత్నదీప కుమారుడు ఆచార్య శేష ఫణిచంద్ర 2017లో, శ్రీరామ్నగర్కు చెందిన గంజి సూర్యనారాయణ, సంధ్య దంపతుల కుమారుడు గంజి భాను ప్రసాద్ 2019లో ఉక్రెయిన్కు వెళ్లి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఇటీవల యాదగిరిగుట్టకు వచ్చిన విద్యార్థులు గతేడాది ఆగస్టులో తిరిగి ఉక్రెయిన్కు వెళ్లారు.
ప్రస్తుతం క్షేమం..
ప్రస్తుతం తాము క్షేమంగానే ఉన్నట్లు భాను ప్రసాద్, శేష ఫణిచంద్ర తెలిపారు. తల్లిదండ్రులతో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతూ సురక్షిత ప్రాంతమైన ఇస్ట్రన్ రీజియన్ ప్రాంతంలో ఉన్నట్లు వెల్లడించారు. ఇండియన్ ఎంబసీ అధికారులు తమ క్షేమ సమాచారం తెలుసుకునేందుకు ఐదు ఫోన్ నంబర్లు ఇచ్చారని తెలిపారు. వెబ్సైట్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయాలని విజ్ఞప్తి చేశారన్నారు. తదుపరి సమాచారం అందే వరకూ యూనివర్సిటీని వదిలి బయటకు రావొద్దని ఎంబసీ అధికారులు స్పష్టం చేశారని విద్యార్థులు వెల్లడించారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత వెస్ట్రన్ రీజియన్లో సురక్షిత ఎయిర్పోర్ట్ నుంచి భారతదేశానికి పంపుతామని తెలిపారన్నారు. ప్రస్తుతం దుకాణాలన్నీ మూసి ఉన్నాయని, ఏటీఎంల వద్ద జనం బారులుదీరారని చెప్తూ.. 15 రోజులకు సరిపడా కూరగాయలు వెంట తీసుకుని యూనివర్సిటీలో ఉంటున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి…
విద్యార్థుల తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడుతూ తమ కుమారులను సురక్షితంగా తీసుకువచ్చేలా విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. వారం రోజుల ముందే విమాన టిక్కెట్లను బుక్ చేశాం.. అంతలోనే యుద్ధం మొదలుకావడంతో విమానాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు వీడియో కాల్ తెలియడంతో ఊపిరి పీల్చుకున్నామని భాను ప్రసాద్ తండ్రి గంజి సూర్యనారాయణ, ఆచార్య శేష ఫణిచంద్ర పెద నాన్న డాక్టర్ ముడుంబై గిరిధర్ పేర్కొన్నారు.
రష్యా, ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను క్షేమంగా తీసుకు రావాలి
మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 24 : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను వెంటనే స్వదేశానికి రప్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల అజయ్ తండ్రి బాలస్వామి కోరారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తన కుమారుడు 2016లో ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ దేశం వెళ్లాడని, ఆ దేశంలోని కార్కివ్ నగరంలో కరాజిన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడని తెలిపారు. జూన్ నాటికి కోర్సు పూర్తి చేసుకొని ఇంటికి రావాల్సి ఉందని పేర్కొన్నారు. యుద్ధం నేపథ్యంలో మధ్యలోనే వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పటికీ.. పరిస్థితి విషమించి రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచి పోయాయన్నారు. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ పాలకుల ఆదేశాల మేరకు అజయ్తో పాటు అక్కడి విద్యార్థులంతా బంకర్లలోకి వెళ్లినట్లు, అక్కడ వారికి సరిపడా ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విమానాశ్రయాలు రష్యా ఆధీనంలోకి వెళ్లటంతో ప్రస్తుతం ఇండియాకు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు.
సమాజాభివృద్ధిలో ఎన్ఎస్ఎస్ భాగస్వామ్యం అవసరం
రామగిరి, ఫిబ్రవరి 24 : సమాజాభివృద్ధిలో విద్యార్థులను భాగస్వాములను చేయడానికి ఎన్ఎస్ఎస్ చక్కటి వేదికని ఎంజీయూ వీసీ ప్రొ॥ సీహెచ్.గోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులకు గురువారం యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొవిడ్ నేపథ్యంలో రెండు సంత్సరాలుగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం కలిగిందన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఎన్ఎస్ఎస్ అమల్లో ఎంజీయూ ముందువరుసలో ఉందని తెలిపారు. అధికారులు సమష్టిగా పని చేసి మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. త్వరలోనే బడ్జెట్ విడుదల చేస్తామని, యూనివర్సిటీస్థాయి యూత్ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పూర్వ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా॥ దోమల రమేశ్ ఎంజీయూలో ఎన్ఎస్ఎస్ నిర్వహణ, రాష్ట్ర, జాతీయ అవార్డులు, ఎంజీయూకు హరితమిత్ర అవార్డులపై వివరించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ॥ ఎం.కృష్ణారావు, ఎన్ఎస్ఎస్ విభాగం సలహాదారుడు, ప్రపంచ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు ఎంవీ గోనారెడ్డి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ నూతన కోఆర్డినేగర్ డాక్టర్ పి.మద్దిలేటి, దోమల రమేశ్ను పీఓలు సన్మానించారు. సమావేశంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణారావు, యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఎన్ఎస్ఎస్ బడ్జెట్ ఆమోదం
ఎంజీయూలో మధ్యాహ్నం జరిగిన ఎన్ఎస్ఎస్ అడ్వయిజరీ సమావేశంలో కమిటీ సభ్యుల సమక్షంలో పలు తీర్మానాలు చేశారు. ఎంజీయూ పరిధిలో ఎన్ఎస్ఎస్ అమలు, కొత్త కార్యక్రమాల నిర్వహణ, 2021-22 బడ్జెట్ను ఆమోదించారు.