మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఇక నృసింహ రిజర్వాయరే తరువాయి..
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరువు నేలలు మురిసేలా కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక జల దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభోత్సవం చేసుకున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి గోదారమ్మ ఉప్పొంగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోని నృసింహ(బస్వాపూర్) రిజర్వాయర్కు గోదావరి జలాలు తరలిరావడమే మిగిలింది. మల్లన్న సాగర్ నుంచే నృసింహ రిజర్వాయర్కు నీరందించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. 1.5టీఎంసీల మేర నిల్వకు అవసరమైన అన్ని పనులను పూర్తి చేసిన నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్ను సిద్ధంగా ఉంచారు. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయానికి సైతం కాళేశ్వరం జలాలనే అందించనుండగా, మార్చి 8 లేదా 10న గండి చెరువులోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చేరువవుతున్న గోదావరి జలాలను తల్చుకున్న రైతన్న మోముల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సైతం సిద్ధించనున్నది.
కొమురవెల్లి మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభోత్సవంతో కాళేశ్వరం ప్రాజెక్టు స్వప్నం సంపూర్ణమైంది. ఇక నృసింహ(బస్వాపూర్) రిజర్వాయర్లోకి గంగమ్మ తరలిరావడమే మిగిలింది. ఈ మహత్తర ఘట్టం త్వరలోనే ఆవిష్కృతం కానున్నది. 1.5 టీఎంసీల మేర నీరు నింపుకొనేందుకు అవసరమైన అన్ని పనులను పూర్తి చేసిన నీటిపారుదల శాఖ అధికారులు.. గోదావరి జలాల రాకకోసం రిజర్వాయర్ను సిద్ధ్దం చేశారు. రైతుల కన్నీటి కడగండ్లను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సవాళ్లు.. మరెన్నో ఆటుపోట్లకు ఎదురొడ్డి పట్టుదలతో నృసింహ రిజర్వాయర్ పనులను చేపడుతున్నది. ఆధ్మాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ‘యాదాద్రి’ తాగునీటి అవసరాలకు సైతం ఇక్కడి నుంచే నీరందించనుండగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగు, సాగునీటి ఇబ్బందులను తీర్చి ఈ ప్రాంతానికి వరప్రదాయినిగా నృసింహ రిజర్వాయర్ నిలువబోతున్నది.
మార్చి 8 లేదా 10న గండి చెరువుకు కాళేశ్వరం నీళ్లు!
యాదాద్రి ప్రధాన ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలకు సైతం బస్వాపూర్ రిజర్వాయర్ నుంచే నీటిని పంపింగ్ చేసేలా ప్లాన్ చేశారు. యాదాద్రికి వచ్చే భక్తుల పుణ్యస్నానాలకు వీలుగా కొండకింద ఉన్న గండి చెరువు చెంత లక్ష్మీ పుష్కరిణి, కొండపైన స్వామివారి కైంకర్యాల కోసం విష్ణు పుష్కరిణి ఆధునిక హంగులతో నిర్మించారు. రూ.33కోట్లతో గండి చెరువు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మార్చి 28న జరిగే ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణకు ముందే గోదావరి జలాలను గండి చెరువుకు తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటీ-2 డిస్ట్రిబ్యూటరీ కాలువ నుంచి 1.7 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా గండి చెరువుకు నీటిని అందించనున్నారు. ఇందుకు సంబంధించి పైపులైన్ పనులు పూర్తికావొచ్చాయి. నృసింహ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు చేరకముందు 8వ కిలోమీటర్ వద్దనే ప్రధాన కాల్వ నుంచి గండి చెరువుకు నీటిని మళ్లించనున్నారు. నృసింహ రిజర్వాయర్ నీటి విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదని, గండి చెరువుకు మాత్రం మార్చి 8 లేదా 10 తేదీల్లో నీటిని తరలించే అవకాశం ఉందని 16వ ప్యాకేజీ ఈఈ ఖుర్షీద్ మొయినొద్దీన్ తెలిపారు.
ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నృసింహ రిజర్వాయర్ భవిష్యత్లో వరప్రదాయినిగా నిలువనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 16వ ప్యాకేజీలో 0.8 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ జలాశయాన్ని నిర్మించేలా గత ప్రభుత్వం డిజైన్ చేయగా.. తెలంగాణ ప్రభుత్వం డిజైన్లో మార్పులు చేసింది. సామర్థ్యాన్ని 11.39 టీఎంసీలకు పెంచి రూ.1,578కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేలా డిజైన్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1,218 చెరువులను నింపి 1,88,500 ఎకరాలకు సాగు నీరందించేలా రిజర్వాయర్కు రూపకల్పన చేశారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు, ఆత్మకూరు, భువనగిరి, తుర్కపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, మోటకొండూర్, చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట మండలాలతోపాటు నల్లగొండ జిల్లాలోని చిట్యాల పరిసర ప్రాంతాలు ఈ రిజర్వాయర్తో ప్రయోజనం పొందనున్నాయి. రిజర్వాయర్ను 1.5 టీఎంసీల సామర్థ్యానికి సిద్ధ్దం చేసేందుకు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పలు సందర్భాల్లో రిజర్వాయర్ పనులను పరిశీలించి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఆ దిశగా పనులను వేగవంతం చేసి పూర్తి చేశారు. నృసింహ రిజర్వాయర్ నీటితోనే ఉమ్మడి జిల్లాలో తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి.
మల్లన్నసాగర్ టు బస్వాపూర్..
ఉమ్మడి జిల్లాలో చివరి ఆయకట్టుకూ సాగు నీరందించి కరువును తరిమేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. రెండేండ్ల క్రితమే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి కాళేశ్వరం తొలిఫలాలను ఆలేరు నియోజకవర్గానికి అందించారు. ప్రస్తుతం తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నవాబ్పేట రిజర్వాయర్ నుంచి గుండాల మండలంలో గోదావరి జలాలు పారుతున్నాయి. ఎవుసానికి జీవం పోసిన గోదావరి జలాలతో ఈ మూడు మండలాల రైతు కుటుంబాలు సంతోషంతో గడుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నృసింహ రిజర్వాయర్కు కాళేశ్వరం జలాలను అందించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా తొలుత రిజర్వాయర్లో 1.5 టీఎంసీల నీటిని నింపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. కాల్వ లైనింగ్ స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, సొరంగం, తూముల నిర్మాణం పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. కొడకండ్ల నుంచి గ్రావిటీ ద్వారా నీటిని జగదేవ్పూర్ మీదుగా నృసింహ రిజర్వాయర్లోకి తరలించేలా నీటిపారుదల శాఖ అధికారులు డిజైన్ చేశారు. ఇప్పటివరకు రిజర్వాయర్కు సంబంధించి 75 శాతం పనులు పూర్తయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.