పాఠశాలల అభివృద్ధికి ఈ నెల 28లోగా అంచనాలు పంపించాలి జిల్లాలో మొదటి
విడుతలో 517 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్లగొండ, ఫిబ్రవరి 23 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన మన ఊరు – మన బడి, మన బస్తీ-మన బడి పథక కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచిం చారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో బుధవారం మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, ఎస్ఎంసీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, సర్పంచులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 517 పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ పథకం కింద 12 రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్, తాగునీరు, రన్నింగ్ వాటర్ సౌకర్యం, టాయిలెట్ల నిర్మాణం, భవనాలకు రంగులు, మరమ్మతులు, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, విద్యుదీకరణ, డిజిటల్ పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పనులకు కలెక్టర్ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తారని ఇది పాఠశాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. చేపట్టిన పనులు మూడేండ్లలో పూర్తి చేసి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండు లక్షలు విరాళం ఇచ్చిన వారిని పాఠశాల కమిటీలో సభ్యుడిగా చేర్చుకోవచ్చని.. పది లక్షలు, అంతకు మించి ఇచ్చిన వారి పేరును తరగతి గదిలో ఒక దానికి పెట్టుకోవచ్చని వివరించారు. సమావేశంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జడ్పీ సీఈఓ వీర బ్రహ్మచారి, డీఈఓ భిక్షపతి, ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, డీపీఓ విష్ణువర్ధ్దన్ రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని, ఆర్డీఓ గోపీరాం, డీసీఓ ప్రసాద్ పాల్గొన్నారు.