పెద్దఅడిశర్లపల్లి/డిండి/చందంపేట/మాల్/దేవరకొండ రూరల్/ చిట్యాల/మిర్యాలగూడరూరల్/ మర్రిగూడ/ నార్కట్పల్లి, ఫిబ్రవరి 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ పిలుపు నిచ్చారు. పెద్దఅడిశర్లపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మన ఊరు మనబడిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను గుర్తించి అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. మండలంలో మొదటి విడుతలో 18 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేంద్రప్రసాద్, ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, ఎంపీడీఓ మోహన్రెడ్డి, ఎంఈఓ రాము పాల్గొన్నారు. డిండి, చందంపేట, నేరేడుగొమ్ము, చింతపల్లి, మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎంపీపీలు సునీతాజనార్దన్రావు, పార్వతి, కొండూరి భవానీ పవన్కుమార్, కొలను సునీత, సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, నూకల సరళాహన్మంతరెడ్డి, మర్రిగూడలో జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేవరకొండ ఎంపీడీఓ సమావేశంలో ఆర్డీఓ గోపీరాం మాట్లాడుతూ మండలంలో 20 పాఠశాలలు ఎంపికైనట్లు తెలిపారు.
పాఠశాలల పరిశీలన
దేవరకొండ/గుర్రంపోడు/హాలియా/తిప్పర్తి : దేవరకొండ జడ్పీ ఉన్నత బాలుర పాఠశాలలో గదులను గురువారం మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీడీఓ శర్మ పరిశీలించారు. గుర్రంపోడు మండలం పోచంపల్లి, కట్టవారిగూడెం, చామలేడు, పిట్టలగూడెం పాఠశాలలను మండల అధికారుల బృందం పరిశీలించింది. అనుముల మండలం యాచారం, చింతూగూడెం, హాలియా, కొత్తపల్లి, పంటవానికుంట, పాలెం గ్రామాల్లో 10 పాఠశాలను జిల్లా హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఎంపీడీఓ గోళ్ల లక్ష్మి తిప్పర్తి మండలం రాజుపేట ప్రాథమిక పాఠశాలను ఎంపీడీఓ మహేందర్రెడ్డి అధికారులు బృందం సందర్శించింది. ఆయా సమావేశాలు, సందర్శనల్లో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.