నూరు శాతం ఆవాసాలకు మిషన్ భగీరథ
రోడ్ల విభాగంలోనూ తొలి స్థానం
అత్యధిక ఎస్జీహెచ్లు, రుణ లబ్ధిలోనూ రికార్డ్
అక్షరాస్యతలో పెరుగుదల
తండాల్లో మెరుగుపడాల్సి ఉన్న బాలికా నిష్పత్తి
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో ఎప్పుడూ వెనుకబడిన జిల్లాల జాబితాలోనే ఉండే ఉమ్మడి నల్లగొండ జిల్లా నేడు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయంతోపాటు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మిషన్ కాకతీయతో చేపట్టిన పనులతో సాగు విస్తీర్ణంతోపాటు పంటల దిగుబడిలోనూ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. చేపలు ఉత్పత్తిలో మొదటి స్థానంలోముఖ్యంగా సూర్యాపేట జిల్లా వ్యవసాయంలో గణనీయమైన వృద్ధి సాధించింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల వారీగా లెక్కలను విడివిడిగా పొందుపర్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన వివరాలతో ఏ జిల్లా, ఏ రంగంలో అగ్రస్థానంలో ఉందన్న సమగ్ర వివరాలతో గణాంకాలను రూపొందించారు. 2020-21లో జనాభాపరంగా నల్లగొండ 4వ స్థానంలో ఉండగా వ్యవసాయంలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
ఇక పెరిగిన వ్యవసాయంతో ఉపాధి అవకాశాలు భారీగా మెరుగపడ్డాయి. ఫ్లోరైడ్కు పర్యాదపదంగా మారిన జిల్లాలో మిషన్ భగీరథతో నూరుశాతం ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా అవుతున్నది. నేషనల్ హైవేలతోపాటు ఇతర రహదారుల విస్తీర్ణంలోనూ ఉమ్మడి జిల్లాదే తొలి స్థానం. అక్షరాస్యత విషయంలోనూ మెరుగైన ఫలితాలు ఉండగా, తండాల్లో మాత్రం బాలికా నిష్పత్తి తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. మహిళా వికాసం, ఎస్హెచ్జీలకు రుణాల పంపిణీలోనూ రాష్ట్రంలోనే అత్యధిక లబ్ధి నల్లగొండదే కావడం విశేషం. పలు అంశాల వారీగా విడుదల చేసిన గణాంకాల్లో ఉమ్మడి జిల్లా అద్భుతమైన ప్రగతిని సాధించింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనా దక్షతతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ప్రణాళిక విభాగం 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రగతి గణాంకాలను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి, ప్రస్తుత పరిస్థితిని అంశాల వారీగా పొందుపరించింది. జిల్లాల వారీగా వివరాలను వెల్లడించింది. జనాభా, స్త్రీ పురుష నిష్పత్తి, అక్షరాస్యత, వ్యవసాయం, దాని అనుబంధ విభాగాలు, పరిశ్రమలు, ఉపాధి, తాగు, సాగు నీటి వనరులు, అమలులో ఉన్న వివిధ పథకాలు, లబ్ధిదారులు, రోడ్లు, ఇతర మౌలిక వసతులు ఇలా అనేక అంశాల వారీగా వివరాలను ఇందులో పొందుపరిచింది.
వ్యవసాయంలో టాప్…
సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల పటిష్టతతో పాటు ఉచిత కరంటు, రైతుబంధు లాంటి పథకాలతో ఉమ్మడి జిల్లా గణనీయమైన ప్రగతిని సాధించింది. 2020-21 వానకాలంలో సూర్యాపేట జిల్లా సాగులో ప్రథమ స్థానంలో నిలిస్తే యాసంగిలో నల్లగొండ జిల్లా టాప్లోకి వచ్చింది. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు రావడంతో సూర్యాపేటలో ప్రతి ఎకరాకూ సాగు నీరు అందుబాటులోకి వచ్చింది. దాంతో భూవిస్తీర్ణంలో తక్కువే అయినా సాగులో అగ్రస్థానానికి చేరుకున్నది. 2020-21 వానకాలంలో సూర్యాపేట జిల్లాలో 4.01లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా 7.72లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. రెండోస్థానంలో నల్లగొండ జిల్లాలో 3.94లక్షల ఎకరాలకు గాను 8.02లక్షల మెట్రిక్ టన్నులు, యాదాద్రిలో 2.04లక్షల ఎకరాల్లో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో 10వ స్థానంలో నిలిచింది. యాసంగిలో నల్లగొండ జిల్లా 4.60లక్షల ఎకరాల్లో 10.27లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి సాధించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది.రెండోస్థానంలో సూర్యాపేట జిల్లా 4.31లక్షల ఎకరాల్లో 10.05లక్షల మెట్రిక్ టన్నులు, 7వ స్థానంలో నిలిచిన యాదాద్రి జిల్లా 2.46లక్షల ఎకరాల్లో 5.36లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించాయి. దాంతో పాటు పత్తి సాగులో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. మొత్తం 7.03లక్షల ఎకరాల్లో సాగు కాగా, సూర్యాపేటలో 1.51లక్షల ఎకరాలు, యాదాద్రిలో 1.82లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
పెరిగిన భూగర్భ జలం..
2015 సంవత్సరం నుంచి 2021 నాటికి సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల బలోపేతం, సకాలంలో వర్షాలతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. నల్లగొండ జిల్లాలో ఈ ఆరేండ్లలో 4.41మీటర్లు అదనంగా నీటిమట్టం పైకి రాగా సూర్యాపేట జిల్లాలో 4.39మీటర్లు ఉబికి వచ్చింది. యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే భూగర్భజలాల పెరుగుదలలో రెండో స్థానం అక్రమించగా ఇక్కడ మొత్తం 7.47మీటర్ల మేర పైకి ఎగబాకాయి.
అక్షరాస్యతలో యాదాద్రి జిల్లా 65.2శాతం
అక్షరాస్యత పరంగా ఉమ్మడి జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా ముందున్నది. యాదాద్రి జిల్లాలో 65.2శాతం అక్షరాస్యత నమోదు కాగా పురుషులు 75.5శాతం, స్త్రీలు 54.8శాతం, సూర్యాపేట జిల్లాలో మొత్తం 64.1శాతం కాగా పురుషులు 73.4, స్త్రీలు 54.9శాతం, నల్లగొండ జిల్లాలో మొత్తం 63.8శాతం అక్షరాస్యత నమోదు కాగా పురుషులు 73.9శాతం, స్త్రీలు 53.5శాతం నమోదైంది. గతంతో పోలిస్తే అక్షరాస్యత పెరుగడం గమనార్హం.
జనాభా పరంగా నల్లగొండ నాలుగో స్థానంలో..
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల తరువాత నల్లగొండ జిల్లా జనాభా పరంగా నాలుగో స్థానంలో నిలిచింది.నల్లగొండలో 7,222చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి గాను 16,18,416 మంది, యాదాద్రిలో 3,425 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి గాను 7,70,833 మంది, సూర్యాపేటలో 3,578చదరుపు కిలోమీటర్ల విస్తీర్ణానికి గాను 10,99,560 మంది జనాభా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి.నల్లగొండలో గ్రామీణ జనాభా 77.2శాతం, పట్టణ జనాభా 22.8శాతం ఉండగా, యాదాద్రిలో గ్రామీణ జనాభా 84శాతం, పట్టణ జనాభా 16శాతం, సూర్యాపేట జిల్లాలో గ్రామీణ జనాభా 84.4శాతం, పట్టణ జనాభా 15.6శాతం ఉన్నది. ఆరేండ్లలోపు పిల్లలు మొత్తం జనాభాలో నల్లగొండలో 11.2శాతం, యాదాద్రిలో 10.3శాతం, సూర్యాపేటలో 10శాతంగా ఉన్నది.
వ్యవసాయంపైనే అధిక జీవనాధారం…
ఉమ్మడి జిల్లాలో అత్యధిక మంది వ్యవసాయంపై ఆధారపడే ఉపాధి పొందుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 8.06లక్షల మంది కూలీల్లో 48.3శాతం (3.89లక్షలు) వ్యవసాయ కూలీలు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం లేబర్ 5.61లక్షలు కాగా 56.2శాతం (3.15లక్షల మంది) వ్యవసాయంలోనే ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమల పరంగా ఎక్కువ ఉన్న యాదాద్రి జిల్లాలో మొత్తం 3.74లక్షల మంది లేబర్కు గాను 42.1శాతం (1.57లక్షల మంది) వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు.
ఎస్జీహెచ్ గ్రూపులు మన దగ్గరే ఎక్కువ
మహిళా స్వయం సహాయక సంఘాల సంఖ్యాపరంగానూ నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 28,202 గ్రూపులు ఉండగా అందులో 2.99లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరికి ఇప్పటివరకు రూ.948కోట్ల రుణ సదుపాయం కల్పించారు. సూర్యాపేట జిల్లాలో 17,993 గ్రూపుల్లో 1.89లక్షల మంది సభ్యులు ఉండగా రూ.550 కోట్లు, యాదాద్రి జిల్లాలో 14,920 గ్రూపుల్లో 1.57లక్షల మంది సభ్యులు ఉండగా రూ.429కోట్లు రుణం
అందించారు.