రామగిరి, డిసెంబర్ 4 : సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అద్భుతమైన ఆవిష్కరణలతో బాల శాస్త్రవేత్తలు భళా అనిపించుకున్నారు. తమ సృజనాత్మకతతో తయారు చేసిన శాస్త్ర, సాంకేతిక ప్రాజెక్టులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులను ఆలోచింపజేశాయి. విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు వారి సృజనాత్మకతకు దర్పణంగా నిలిచాయి. నల్లగొండలోని డాన్బాస్కో స్కూల్లో శనివారం అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ మానక్ అవార్డుల (2021-22) ప్రదర్శన రెండో రోజు ఆదివారం కొనసాగింది. ఎగ్జిబిట్స్ తెచ్చిన విద్యార్థులు, గైడ్ టీచర్లతోపాటు సందర్శనకు వచ్చిన విద్యార్థులతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది.
సాంకేతికత మరియు బొమ్మలు అనే ప్రధానాంశంతోపాటు ఏడు ఉప అంశాలతో బీఈడీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన టీచర్ లెర్నింగ్ పరికరాల ప్రదర్శనల్లో జిల్లా వ్యాప్తంగా 303 సైన్స్ ప్రాజెక్టులు, బీఈడీ విద్యార్థుల టీఎల్ఎం, 92 ఇన్స్పైర్ ప్రాజెక్టులు కలిపి 403 ప్రదర్శనలు ఇచ్చారు. చిన్నారులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అందరినీ ఆలోచింపజేశాయి. ప్రదర్శనలను డీఈఓ బి.భిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్తో కలిసి తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు అవగాహన కల్పించి ప్రోత్సహిస్తే విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని చెప్పారు.
నల్లగొండలోని డాన్బాస్కో పాఠశాలలో ఈ నెల 3నుంచి నిర్వహించే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ సోమవారం మధ్యాహ్నంతో ముగుస్తుందని జిల్లా విద్యాశాఖ వెల్లడించింది. తిలకించేవారు మధ్యాహ్నం వరకే రావాల్సి ఉంటుంది. సాయంత్రం 4గంటలకు ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులతోపాటు రాష్ట్రస్థాయికి ఎంపికైన ఎగ్జిబిట్స్ వివరాలను వెల్లడిస్తారు. ముగింపునకు ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హాజరు కానున్నట్లు సమాచారం.
ఇన్స్పైర్ మానక్ అవార్డుల్లో భాగంగా ఎంపికైన ప్రాజెక్టు ఇది. భూమిపై సంభవించే కాలుష్య విధానాలతో వచ్చే సల్ఫర్, దాని అనుబంధ అంశాలతో ఆమ్ల వర్షాలు వస్తాయని కండ్లకు కట్టినట్లు వివరించారు. దీంతో భూమిపై జీవకోటి మనుగడకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. అదేవిధంగా మనుషులకు చర్మ వ్యాధులు ఎలా వస్తాయో వివరించారు. ఇది జరుగకుండా ఉండాలంటే మోటర్ వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగను నియంత్రించాలని సూచించారు. దీంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని, ఆమ్ల వర్షాలను అడ్డుకోవడంతోపాటు పర్యావరణ రక్షణ కలుగుతుందని తెలిపారు.
సాధారణంగా థర్మామీటర్లో పాదరసం ఉంటుంది. దాని హెచ్చుతగ్గులను బట్టి జ్వరం తీవ్రత చూస్తారు. అయితే.. ఈ విషయం చదువుకున్న వారికే తెలుస్తుంది. చదువు రాని వారికి అర్థం కాదు. వారు కూడా చూసుకునేలా థర్మమీటర్పై గ్రీన్, బ్లూ, రెడ్ గుర్తులతో తయారు చేశారు. గ్రీన్ వరకు ఉంటే ఎలాంటి జ్వరం లేదని, బ్లూ ఉంటే ఇబ్బంది లేదని, రెడ్ వరకు కనిపిస్తే జ్వరం తీవ్రంగా ఉందని ప్రత్యక్షంగా చూపించారు.
విద్యార్థులు తమలోని శాస్త్రీయ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వారి ప్రతిభకు పట్టం కట్టేది వైజ్ఞానిక ప్రదర్శన. జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలు, బీఈడీ, డీఈడీ కళాశాలల నుంచి 403 ప్రదర్శనలను బాల శాస్త్రవేత్తలు, బీఈడీ ఛాత్రోపాధ్యాయులు ప్రదర్శించి ఆలోచింపజేశారు. ఎస్సీఈఆర్టీ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారుల సూచనలతో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన అందరి సహకారంతో విజయవంతం చేయగలిగాం. సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ మానక్ ప్రాజెక్టులకు ఉపాధ్యాయులు గైడ్ టీచర్గా ఉండి విద్యార్థులతో చాలా ఉత్తమ ప్రదర్శనలను తీసుకురావడం సంతోషకరం. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు.
– బి.భిక్షపతి, డీఈఓ
విద్యార్థుల శాస్త్రీయ సైన్స్ ఆవిష్కరణలకు ప్రతి రూపంగా సైన్స్ ఎగ్జిబిట్స్ తీసుకొచ్చారు. కలెక్టర్, డీఈఓ ఆదేశాలు, సూచనలతో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన-2022 కమిటీని ఏర్పాటు చేశాం. వివిధ విభాగాల్లోని కమిటీల సభ్యులమంతా సమన్వయంతో పని చేశాం. ప్రదర్శనకు వచ్చిన విద్యార్థులకు, గైడ్ టీచర్లకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా వసతులు కల్పించాం.
– వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి
15 సంవత్సరాలుగా ఈ సైన్స్ ప్రదర్శనలో భాగస్వామ్యం అవుతున్నాం. ఈ పర్యాయం గతంలో కంటే ఉత్తమమైన ప్రదర్శనలు తీసుకొచ్చారు. ప్రదర్శనల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషి కనిపించింది. వైజ్ఞానిక ప్రదర్శనకు తీసుకొచ్చిన ఎగ్జిబిట్స్ విద్యార్థుల మేథో సంపత్తిని పెంచేలా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో గణితం, సైన్స్, పర్యావరణ అంశాల పరిరక్షణకు సంబంధించిన పలు ఎగ్జిబిట్స్ తీసుకురావడం ఎంతగానో ఆలోచింపజేశాయి.
– టి.కరుణదేవి, జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు
నేటి ఆధునిక యుగంలో మనిషి మరగా తయారవుతున్నాడు. దాంతో యాంత్రీకరణ పెరిగింది. ఫలితంగా గాలి, నీరు, వాతావరణం కలుషితం అవుతున్నాయి. ఈ క్రమంలో పర్యావరణం దెబ్బతినకుండా వ్యవసాయంలో అభివృద్ధి ఫలాలను ఎలా పెంచాలనే అంశాలపై వివరించారు. పచ్చని చెట్లతో గాలి, నీరు, కలుషితం కాకుండా చూడాలన్నారు. హైడ్రో ఎలక్ట్రికల్ అంశాలను తెలిపారు. ప్రకృతి, పర్యావరణం పరిరక్షించుకునేలా ఏకోఫ్రెండ్లీ సిటీలు దోహదం చేస్తాయని వివరించారు. మోడల్ విలేజ్లో భాగంగా మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహితం, రోడ్ల వెంట చెట్లు నాటడంతోపాటు అవగాహన పెంచుకోవాలని చూపించారు. వ్యవసాయదారులు పశువుల పేడను వృథా చేయకుండా బయోగ్యాస్ తయారు చేసుకోవచ్చన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల ఆరోగ్య రక్షణలో ఇవి ఉపయోగపడుతున్నట్లు ప్రయోగ మోడల్తో వివరించారు.
నిత్యం ఇంట్లో, వీధుల్లో పడేసే చెత్తతో విద్యుత్ తయారు చేశారు. పండ్ల తొక్కలు, కూరగాయల ముక్కలు, ఇతర వ్యర్థాలను కొంత కాలం నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని ప్రత్యేక డబ్బాలు లేదా గాజు సీసాల్లో వేయాలి. వాటిల్లో కాపర్, జింక్ కడ్టీల నుంచి రెండు తీగల సహాయంతో విద్యుత్ బల్బులు వెలిగించారు. ఇలాంటి ప్రాజెక్టులను తయారు చేసి ప్రోత్సహిస్తే వ్యర్థాలతో పర్యావరణానికి నష్టం కలుగకుండా చూడవచ్చని వెల్లడించారు.
ఎర్ర గొంగూర కాండం నుంచి తీసిన గోగు నారను మెత్తటి గడ్డిగా మార్చి, దానికి పలుచటి బట్ట, దూదిని ఉపయోగించి బాలికలు రుతుక్రమం సమయంలో ఉపయోగించే సైడ్ ఎఫెక్ట్ లేని ప్యాడ్స్ను తయారు చేశారు. ఇవి ఏకో ఫ్రెండ్లీగా ఉంటాయన్నారు. వీటి వల్ల ఫంగస్, బ్యాక్టీరియా, వైరల్కు చెందిన వ్యాధులు రావు. అదేవిధంగా నెలసరిలో వచ్చే పొత్తి కడుపులో నొప్పి, నెలసరి తిమ్మిర్లు తగ్గుతాయి. ఇవి పర్యావరణ హితంగా ఉంటాయని చెప్పారు. మార్కెట్లో లభించే వాటి కంటే చాలా తక్కువ ఖర్చు అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టును పరిశీలించిన డీఈఓ భిక్షపతి విద్యార్థినితోపాటు గైడ్ టీచర్ను అభినందించారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన అంశాల ప్రతిపాదనతో వస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు అందించేలా చూస్తామని చెప్పారు.
విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనలో బోర్డుపై బొమ్మలు గీసి చెప్తే అంతగా గుర్తుండదు.. బోధనోపకరణాలు (టీఎల్ఎం – టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్) చూపించి చెప్తే అర్థవంతంగా ఉంటుందంటున్నారు వీరు. వాస్తవికమైన విషయాలను విద్యార్థుల కండ్ల ముందు ఉంచి పాఠాలు చెప్తే నిజ జీవితంలో ఎక్కువ రోజులు గుర్తుంటాయని వివరించారు. కచ్చితంగా ఉపాధ్యాయులు టీఎల్ఎంతో పాఠ్యాంశాలు చెప్పాలనేదే బీఈడీ శిక్షణలో నేర్చుకుంటామని చెప్పారు. లో కాస్ట్ టీఎల్ఎం విత్ వర్కింగ్ మోడల్స్ అనే అంశాలను వేస్ట్ మెటీరియల్స్ ఉపయోగించి చేశామన్నారు. అదేవిధంగా చెక్కలు, బోల్టులతో సూక్ష్మదర్శిని చేసి మొబైల్తో వాటిని వీక్షించి చిత్రాలను ఫొటోలు తీసుకునే దానిని తయారు చేశారు. సిగరేట్, బీడీ, చుట్ట తాగడంతో ఊపిరితిత్తులు చెడిపోయే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. వివిధ టీఎల్ఎంలతో ప్రదర్శనలో అవగాహన కల్పించారు. వీటిని తిలకించిన డీఈఓ భిక్షపతి, ఇతర అధికారులు ఛాత్రోపాధ్యాయులను, వారి గైడ్ టీచర్ను అభినందించారు.