సీఎం కప్ క్రీడా పోటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. మంగళవారం రెండోరోజు వివిధ విభాగాల్లో పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఆటల పోటీలను చూసేందుకు యువత పెద్ద ఎత్తున రావడంతో క్రీడా ప్రాంగణాలు సందడిగా మారాయి. బుధవారం పోటీలు ముగియనుండగా ప్రతిభ చూపిన జట్లు, క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడాపోటీలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో గ్రామీణ యువతీ, యువకులు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మండల స్థాయిలో పూర్తికాగా.. జిల్లా స్థాయి పోటీలు జరుగుతున్నాయి. రెండో రోజు ఆయా విభాగాల్లో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. బుధవారం జిల్లా స్థాయి పోటీలు పూర్తి కానున్నాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు.
నల్లగొండలో 80 జట్లు..
నల్లగొండ రూరల్, మే 23 : సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు రెండో రోజు హోరాహోరీగా సాగాయి. మంగళవారం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, ఆథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా.. మొత్తం 80 జట్లు, 996 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఖోఖో పురుషుల విభాగంలో దేవరకొండ, నల్లగొండ, గుర్రంపోడు, అడవిదేవులపల్లి జట్లు సెమీ ఫైనల్కు చేరాయి. మహిళా విభాగంలో నల్లగొండ, కనగల్ జట్లు ఫైనల్కు చేరాయి. కబడ్డీ మహిళా విభాగంలో అనుముల, త్రిపురారం జట్లు ఫైనల్కు వెళ్లాయి. కట్టంగూర్ – నకిరేకల్ జట్లు థర్డ్ ప్లేస్కు ఆడనున్నాయి. కబడ్డీ బాలుర, వాలీబాల్ పురుషుల విభాగాల్లో నల్లగొండ, దామరచర్ల జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. వాలీబాల్ మహిళా విభాగంలో నిడమనూరు, కేతేపల్లి ఫైనల్కు వెళ్లాయి. ఈ పోటీలను జిల్లా యువజన, క్రీడల ప్రాధికార సంస్థ అధికారి మగ్బూల్ అహ్మద్ పర్యవేక్షించారు.
సూర్యాపేటలో 1036మంది క్రీడాకారులు
సూర్యాపేట టౌన్, మే 23 : సీఎం కప్ టోర్నమెంట్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీల్లో గెలుపొందిన 1036 మంది క్రీడాకారులు 91 జట్లుగా జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. మంగళవారం నిర్వహించిన పోటీల్లో ఖోఖో బాలుర విభాగంలో నేరేడుచర్ల జట్టుపై చింతలపాలెం, తిరుమలగిరిపై సూర్యాపేట, మద్దిరాలపై చివ్వెంల, జాజిరెడ్డిగూడెంపై నాగారం, చిలుకూరుపై తుంగతుర్తి జట్లు గెలుపొందాయి. బాలుర కబడ్డీలో మద్దిరాలపై నడిగూడెం, చింతలపాలెంపై మోతె, పాలకవీడుపై మునగాల, పెన్పహాడ్పై తుంగతుర్తి, హుజూర్నగర్పై మఠంపల్లి, మేళ్లచెర్వుపై కోదాడ, అనంతగిరిపై నూతనకల్, తిరుమలగిరిపై చిలుకూరు జట్లు విజయం సాధించాయి. మహిళల కబడ్డీలో నడిగూడెంపై మేళ్లచెర్వు, సూర్యాపేటపై హుజూర్నగర్, నూతనకల్పై నేరేడుచర్ల జట్లు గెలుపొందాయి. బాలుర వాలీబాల్లో మోతెపై సూర్యాపేట, తుంగతుర్తిపై తిరుమలగిరి, మఠంపల్లిపై చిలుకూరు జట్లు గెలుచుకున్నాయి. బాలికల వాలీబాల్లో గరిడేపల్లిపై అనంతగిరి గెలిచి ఫైనల్కు చేరుకుంది. బాలికల ఖోఖో పోటీల్లో తుంగతుర్తి ప్రథమ, సూర్యాపేట జట్టు ద్వితీయ స్థానంలో గెలుపొందాయి.
భువనగిరిలో..
భువనగిరి అర్బన్, మే 23 : సీఎం కప్ టోర్నమెంట్లో భాగంగా భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు రెండో రోజు కొనసాగాయి. మంగళవారం మొత్తం 672 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వాలీబాల్ 13జట్లు, ఫుట్బాల్ పురుషుల విభాగంలో 5, మహిళా విభాగంలో 2జట్లు, కబడ్డీ 8, ఖోఖో పురుషులు 8, మహిళలు 2, బ్యాడ్మింటన్ పురుషుల జట్లు 34, మహిళా జట్లు 8, హ్యాండ్బాల్ పురుషులు 3, మహిళా జట్లు 2, టేబుల్ టెన్నిస్ 4జట్లు, హాకీ రెండు జట్లకు పోటీలు నిర్వహించారు. అథ్లెటిక్లో 110 మంది పాల్గొన్నారు.