నల్లగొండ ప్రతినిధి, జూలై19(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకంపై ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన దళితులకు నేరుగా ఈ ఏడాది నుంచే 10లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసింది. అందుకు సంబంధించిన జీఓ నంబర్ 6ను కూడా ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడిజిల్లాలో ఏ పథకం అమలు చేసినా ఎక్కడా చిత్తుశుద్ధి కానరాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే దళితుల పరిస్థితులు ఉన్నాయనేది కాదనలేని సత్యం. దీంతో ఇలాంటి పథకాలు కాకుండా నేరుగా రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు మాదిరిగానే దళితబంధు ద్వారా నగదు సాయం అందించి తగిన తోడ్పాడు నందించి దళితుల జీవితాలు ఆర్థికంగా నిలదొక్కకునేలా సీఎం కేసీఆర్ ఈ పథకానికి తుదిరూపం ఇస్తున్నారు. ముందుగా హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతూ అన్ని జిల్లాల కలెక్టర్లను, అదనపు కలెక్టర్లను ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా తర్వాత క్రమంలో అన్ని జిల్లాల్లో పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.
ఇప్పటివరకు రూపొందించిన నిబంధనల ప్రకారం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలను 12 యూనిట్లుగా తీసుకుని పథకాన్ని అమలు చేయనున్నారు. గతంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా దళిత కుటుంబాలపై మరోసారి ప్రత్యేకంగా సర్వే చేపట్టనున్నారు. దళితుల పరిస్థితులు కూడా అన్నిచోట్ల ఓకేలా ఉండవని భావించిన ప్రభుత్వం ఈ సర్వేను కూడా గ్రామీణ, సెమీ అర్బన్, పూర్తి అర్బన్ అనే విభాగాలు చేపట్టనుంది. ఈ సర్వేలోనే ఒక్కో కుటుంబం యూనిట్గా ప్రొఫైల్ను రూపొందించనున్నారు. ఇప్పటివరకు వారి జీవన స్థితిగతులను ఇందులో పొందుపర్చనున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని దళితుల అవసరాలను పక్కాగా గుర్తించడం సులభం కానుంది. ఇక ఉమ్మడి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దళితుల్లో మహిళలు 3,18,359, పురుషులు 3,19,026 మంది ఉన్నారు. వీరి ఆర్థిక స్థితిగతులను బట్టి పథకంలోని నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేయనున్నారు.
అర్హుల ఎంపిక సర్వేను కూడా పకడ్భందీగా చేపట్టనున్నారు. దళితబంధు పథకంలో దళారుల ప్రమేయం లేకుండా అర్హుల బ్యాంకు ఖాతాలను సేకరించి రైతుబంధు డబ్బుల మాదిరిగానే ఈ డబ్బును వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎవ్వరూ ఊహించని చారిత్రాత్మక పథకం పట్ల దళితుల వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ ఏదైనా తలపెడితే దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు విశ్రమించబోరని, ఈ పథకం అమలు కూడా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదంటూ పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన రోజు నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడో ఓ చోట దళితవర్గాలు సంబరాలు చేపడుతూనే ఉన్నాయి.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
నల్లగొండ : దళితుల సాధికారిత కోసం ప్రవేశపెట్టిన పథకానికి దళిత బంధుగా నామకరణం చేసిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో దళిత నాయకుడు బకరం వెంకన్న, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, టీఆర్ఎస్ మహిళా మాజీ అధ్యక్షురాలు కొప్పోలు విమలమ్మ, మలపరాజు సగుణమ్మ, కత్తుల వంశీ, తరి నరేందర్, వర్మ, శివ, నరేశ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి
దళిత పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభున్నతికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. దళిత బంధు పథకంతో దళితులకు మంచి రోజులు వస్తాయి.
దళితులను ధనవంతులను చేసే పథకం
సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమంపై తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే సొమ్ము జమ చేస్తామని స్పష్టంగా వెల్లడించారు. ఇది దళితులను ధనవంతులను చేసే గొప్ప పథకంగా నిలిచిపోనుంది.