కంపుకొట్టే మురుగు కాల్వలు.. పాడుబడ్డ బావులు.. వేలాడే విద్యుత్ తీగలతో ఎప్పుడూ అంధకారమే తప్ప వెలుగులెరుగని ఆ పల్లె ఇప్పుడు మెరిసిపోతున్నది. గుక్కెడు నీటి కోసం తండ్లాడిన ఆ ఊరిలో నేడు మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ కృష్ణా శుద్ధిజలాలు అందుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం.. పూడిక తీయని డ్రైనేజీలు, నెలకోసారి కూడా శుభ్రం చేయని వీధులతో కంపుకొట్టే ఆ గ్రామం ఇప్పుడు స్వచ్ఛ పరిమళాలు వెదజల్లుతున్నది. సమైక్య పాలనలో మోడుబారిన ఆ పల్లె నేడు హరితహారం, ప్రకృతి వనాలతో సరికొత్త శోభను సంతరించుకొని ఆహ్లాదం పంచుతున్నది. పల్లె ప్రగతి, రైతు వేదికతో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నది. నెలనెలా వరదలా వస్తున్న నిధులతో అభివృద్ధిపథంలో పయనిస్తూ మురిసిపోతున్నది ఆత్మకూర్(ఎస్) మండలంలోని ఏపూర్ గ్రామపంచాయతీ.
– ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 3
ఏపూర్ గ్రామంలో 4,800 జనాభా ఉన్నది. 12వార్డులు ఉన్న ఈ పంచాయతీలో 3వేల మంది ఓటర్లు ఉన్నారు. గ్రామ పంచాయతీలోని అన్ని వీధుల్లో 26వేల రూపాయలతో చెత్త కుండీలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీకి ఎదురుగా ఉన్న లోతట్టు ప్రాంతాన్ని మట్టి పోసి చదును చేసి రూ.2.70లక్షలతో మినీ పార్కును ఏర్పాటు చేశారు. రూ.90వేలతో ప్రతి ఇంటికీ రెండు బుట్టలు అందజేసి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు, రూ.9లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేసి గ్రామంలోని చెత్తను నిత్యం డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రూ.1.80లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేరుచేసి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. రూ.1.98లక్షలతో పారిశుధ్య పనులు చేపట్టారు. 1.51లక్షల రూపాయలతో పాత బావులను, గుంతలను పూడ్చివేశారు. రూ.6.90లక్షలతో సీసీ రోడ్ల వెంట, సీసీ లేని వీధుల్లో మట్టి పోయించారు. పల్లె ప్రగతి ద్వారా ఇటీవల రూ.6లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. రూ.12.30లక్షలతో వైకుంఠధామం, రూ.12లక్షలతో రైతు వేదిక నిర్మించారు. 30 గుంటల స్థలంలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసి 40 రకాల మొక్కలు 2500 వరకు నాటారు. అవి ఇప్పుడు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలో ఉన్న 400 విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బులు అమర్చారు. ఏపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.
గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడకుంటే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి అర్థం లేదన్నది మహాత్మాగాంధీ మాట. దేశంలో పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చి 64 ఏండ్లు అవుతున్నా బాపూజీ కన్న కలలు నెరవేరలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గ్రామ స్వరాజ్యం వైపు అడుగు వేయలేదు. నాటి సమైక్య పాలనలో తెలంగాణపై వివక్షే తప్ప పెద్దగా అభివృద్ధి జరిగింది లేదు. కానీ.. స్వరాష్ట్రంలో పల్లెల ప్రగతికి అడుగు పడింది. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాలను తీసుకొచ్చారు. అందులో భాగంగా ఆత్మకూర్(ఎస్) మండలంలోని ఏపూర్ గ్రామంలో 2019 సెప్టెంబర్లో జిల్లాలో పల్లె ప్రగతికి అంకురార్పన చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా పంచాయతీలకు నెలనెలా నేరుగా నిధులు ఇచ్చి గ్రామాల ముఖ చిత్రాన్ని మార్చివేశారు. ఫలితంగా గడిచిన 10 నెలల్లో పల్లెలు సరికొత్తగా మారాయి. సమస్యలను దూరం చేసుకుంటూ పచ్చని, పరిశుభ్రమైన గ్రామంగా రూపాంతరం చెందాయి. స్వచ్ఛతకు ఊరికో ట్రాలీ, ట్యాంకర్తో కూడిన ట్రాక్టర్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్డు, రైతు వేదిక, ఇలా ప్రతిదీ సమకూరాయి.
నాడు గ్రామాల్లో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండేది. ఎక్కడికి తరలించాలో, ఎలా తరలించాలో తెలిసేది కాదు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టింది. ఊరికో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసింది. చెత్తను తరలించేందుకు ట్రాక్టర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యర్థాల నుంచి ఎరువుల తయారీకి కంపోస్ట్ షెడ్లను ఏర్పాటు చేసి పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించింది. ఇప్పుడు ఉదయాన్నే ఇండ్ల నుంచి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో కొత్తగా బస్ షెల్టర్ నిర్మించి ప్రయాణికుల కష్టాలు తీర్చారు. ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేసి వైద్య సేవలు చేరువ చేశారు. విద్యార్థులు, యువకుల కోసం క్రీడా ప్రాంగణం.. మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ప్రత్యేకంగా బతుకమ్మ ఘాట్ను ఏర్పాటు చేశారు.
గతంలో గ్రామానికి నిధులు వచ్చేవి కావు. పన్నుల ఆదాయం అంతంత మాత్రమే ఉండేది. పారిశుధ్య కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులకు కూడా సరిపోయేది కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల దశ మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించడం, పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడంతో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో గ్రామంలో అన్ని పనులు విడుతల వారీగా చేపడుతున్నాం.
– సానబోయిన రజిత, ఏపూర్ గ్రామ సర్పంచ్
ప్రకృతి వనం : పచ్చదనం పెంపునకు పట్టణాల తరహాలో రాష్ట్ర సర్కారు పల్లెకో ప్రకృతివనం ఏర్పాటు చేసింది. తీరొక్క మొక్కలను నాటడంతోపాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు అందుబాటులోకి తెచ్చింది. దాంతో స్థానికంగానే ఆహ్లాదం దొరుకుతుందని పల్లెవాసులు పేర్కొంటున్నారు.
రైతు ముచ్చట్లకు వేదిక : రైతులను సంఘటితం చేసేందుకు ప్రభుత్వం క్లస్టర్కో రైతు వేదికను నిర్మించింది. ఆత్మకూర్(ఎస్) మండలంలో 5 క్లస్టర్లు ఉండగా.. అందులో ఏపూర్ గ్రామం ఒకటి. సకల సౌకర్యాలతో రైతు వేదికలను నిర్మించి రైతులకు విజ్ఞాన కేంద్రాల్లా మార్చింది.
ప్రశాంతంగా చివరి మజిలీ : మొన్నటి దాకా అనేక గ్రామాల్లో శ్మశానవాటికలు లేవు. గ్రామంలో ఎవరైనా చనిపోతే ఖననం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడేది. ఆ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లెకో వైకుంఠధామం నిర్మించింది. ఇప్పటికే చాలా గ్రామాల్లో పూర్తి కాగా ఆఖరి మజిలీ ప్రశాంతంగా సాగుతున్నది.