పాలకవీడు, జూలై 25 : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపదతో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సీత్లా, తీజ్ పండుగలు జరుపుకొంటారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఐక్యతను చాటేలా నిర్వహించే ఈ పండుగలు వారి సంప్రదాయానికి అద్దం పడుతున్నాయి. పంటలు బాగా పండాలని, పశు సంపద అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి ఆరాధన ఆ పండుగల్లో అంతర్లీనంగా ఉంటుంది.
అత్యధికంగా తండాలు కలిగిన పాలకవీడు మండలంలో సీత్లా పండుగ సందడి నెలకొంది. లాలి తండా, బెట్టెతండా, పాడ్యాతండా, చెర్వుతండా, కల్మటితండా, కొత్తతండా, శూన్యంపహాడ్, దేవ్లాతండా, మీగడంపహాడ్ తండాల్లో పండుగలు జోరందుకున్నాయి. గిరిజనుల తొలి పండుగ సీత్లా. ఆషాఢ మాసం పెద్ద పుష్యాల తొలి పాదంలో ఈ పండుగను జరుపుకొంటారు. తండాలోని కుటుంబాలన్నీ సమూహంగా ఏర్పడి ప్రకృతి దేవతలైన సీత్లా భవానీతో పాటు ఆరుగురు భవానీల ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వర్షాలు బాగా కురువాలని పాడి పంటలతో పల్లెలు, తండాలు సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ మొక్కులు చెల్లించుకొంటారు. ఏడు రకాల వంటకాలతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఆటా పాటలతో గిరిజన సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తారు. ఈ తంతులో కుల పెద్దలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. సాయంత్రం వేళ అమ్మవార్లకు గొర్రె పోతులను బలి ఇచ్చి, పేగు పైనుంచి పశువులను దాటిస్తారు. దీనినే దాటుడు పండుగ అని అంటారు.
ఘనంగా సీత్లా పండుగ..
జాన్పహాడ్ గ్రామ పంచాయతీ పరిధి కల్మటి తండాలో ఆదివారం సీత్లా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ఆడపిల్లలు సంతోషంగా వుండి వివాహాలు జరగాలని, పశుపక్షాదులు ఆరోగ్యంగా ఉండాలని గ్రామ దేవతలకు గొర్రెపోతులను బలి ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రూపావత్ గోరీ, లక్పతి నాయక్, సైదానాయక్, హేమా నాయక్, మధునాయక్ పాల్గొన్నారు.
ఘనంగా తీజ్…
గిరిజన సంప్రదాయ ఉత్సవాల్లో ప్రధానమైన ‘తీజ్’ను ఆదివారం మండల పరిధిలోని ఎర్రకుంటతండాలో ఘనంగా నిర్వహించారు. నార బుట్టల్లో నవధాన్యాల మొలకలతో యువతులు ప్రదర్శనగా వెళ్లి ప్రత్యేక పూజల అనంతరం బావుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేశారు.