దేవరకొండ, జూలై 20 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నియోజకవర్గంలోని 67 మందికి మంజూరైన రూ.18.73 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు నల్లగాసు జాన్యాదవ్, వంగాల ప్రతాప్రెడ్డి, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ సుభాశ్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, నాయకులు లోకసాని తిరుపతయ్య, రాజు, భాస్కర్, యాదగిరి, మహేందర్, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి
ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.