కొండాపూర్, జూలై 9 : ఈ దంపతులు మానవత్వాన్ని మంటగలిపారు. కరోనా చికిత్స కోసం దవాఖానకు వచ్చిన రోగులపై, మరణించిన వారిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నారు. వాటిని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. గచ్చిబౌలి టిమ్స్ దవాఖానలో వరుసగా చోటుచేసుకున్న సంఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్ఫోన్ క్లూ ఆధారంగా చోరీలకు పాల్పడిన దంపతులను గుర్తించారు. అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా ధర్మపురి గ్రామానికి చెందిన చింతలపల్లి రాజు (36)కు గతంలో పెళ్లి జరుగగా భార్య చనిపోయింది. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. కారు కొనుగోలుచేసి ఓలా క్యాబ్ నడిపిస్తున్నాడు. రాజుకు 2017లో లతశ్రీ (39)తో పరిచయం ఏర్పడగా, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. లతశ్రీకి గతంలో పెండ్లి అయ్యింది. ఆమె భర్త మృతి చెందాడు. రాజు, లతశ్రీ ఇద్దరూ పెళ్లి తర్వాత తమ పిల్లలతో కలిసి కూకట్పల్లి ఎల్లమ్మబండలోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు.
ఇదిలాఉండగా, లతశ్రీ గచ్చిబౌలిలోని టిమ్స్ దవాఖానలో పేషెంట్ కేర్ విధులు నిర్వర్తిస్తున్నది. గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో రాజు తన క్యాబ్లో టిమ్స్ దవాఖానలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని జీడిమెట్ల నుం చి దవాఖానకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో వారితో పరిచయం పెంచుకున్న రాజు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పేషెం ట్ కేర్గా విధుల్లో చేరాడు. దవాఖానలో పనిచేస్తున్న భార్యాభర్తలిద్దరూ కలిసి దొంగతనాలకు పథకం వేశారు. పథకంలో భాగంగా కరోనాతో చికిత్స పొందుతూ అపస్మారకస్థితిలోకి చేరుకున్న వారిని, చికిత్స పొందుతూ మృతి చెందిన వారిని టార్గెట్ చేశారు. చోరీ సమయంలో వీరిలో ఒకరు బాధితుల చుట్టు పక్కల పరిసరాలను గమనిస్తుండగా, మరొకరు బా ధితుల మెడలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకోవడం మొదలుపెట్టారు. చోరీ చేసిన సొమ్మును జీడిమెట్ల జగదాంబ జ్యూవెల్లర్స్ నిర్వహిస్తున్న అశోక్ వద్ద, ముత్తూట్ ఫైనాన్స్, అటికాలలో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు.
అయితే, చనిపోయిన రోగుల ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురికావడంతో వారి కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఓ రోగి వద్ద నుంచి ఈ దంపతులు సెల్ఫోన్ను సైతం చోరీ చేశారు. ఆ సెల్ఫోన్ ఆధారంగా రాజు, లతశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు చేసిన నేరాలను అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువైన 16 తులాల బంగారు, 80 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన గచ్చిబౌలి, జగద్గిరిగుట్ట, సీసీఎస్ పోలీసు అధికారులు, సిబ్బందిని డీసీపీ అభినందించారు.