ఆత్మకూరు(ఎం), జూలై 8 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తిమ్మాపురంలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి పనులపై అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పచ్చదనంతో కళకళలాడే విధంగా కృషి చేయాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామం, వర్మికంపోస్ట్ షెడ్ నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించాలన్నారు. అదేవిధంగా మండలంలోని రహీంఖాన్పేటలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయగా, పోతిరెడ్డిపల్లిలో అధికారులు ప్రకృతి వనాన్ని పరిశీలించడంతోపాటు పల్లెర్లలో పాత ఇండ్లను కూల్చివేసి చదును చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో యాదగిరి, మండల ప్రత్యేకాధికారి శ్యామ్ సుందర్, ఎంపీడీవో రాములు, ఎంపీవో పద్మావతి, సర్పంచ్లు నర్సింహారెడ్డి, రాంరెడ్డి, మాధవి, వెంకటమ్మ, ఉప సర్పంచ్లు అంజయ్య, స్వరూప, పంచాయతీ కార్యదర్శులు స్వప్న, అనిత పాల్గొన్నారు.
మోటకొండూర్లో…
మోటకొండూర్, జూలై 8: ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో వేగం పెంచాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కాటేపల్లి, నాంచారిపేట, కొండాపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం, నర్సరీని ఎంపీడీవో వీరస్వామి, మండల ప్రత్యేకాధికారిని పరిమళాదేవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, సర్పంచ్లు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రగతి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పనులు నెమ్మదిగా జరుగుతున్న గ్రామాల్లో వేగం పెంచేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో కిషన్, సర్పంచ్లు మంత్రి రాజు, పైళ్ల వినోద, కొప్పుల మమత, పంచాయతీ కార్యదర్శులు నందాల సాయికుమార్, జావీద్ తదితరులు ఉన్నారు.