న్యూఢిల్లీ : యాస్ తుఫానుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను నేపథ్యంలో చేపట్టాల్సిన సన్నాహాలను సమీక్షించేందుకు ఉదయం 11 గంటలకు సీనియర్ ప్రభుత్వ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రతినిధులు, టెలికాం, విద్యుత్, పౌర విమానయాన, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు ఆయాశాఖల మంత్రులు హాజరవనున్నారు. తుఫాను ఈ నెల 24 -26వ తేదీ మధ్య ఒడిశా తీరంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తుఫాను నేపథ్యంలో రైల్వే ఒడిశాలోని భువనేశ్వర్, పూరి నుంచి 20కిపైగా తాత్కాలిక రైళ్లను రద్దు చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ తుఫాను నేపథ్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను గుజరాత్, మహారాష్ట్రలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో భారీగా నష్టం వాటిల్లింది.