ములుగుటౌన్ : సామాజిక భద్రత లక్ష్యంగా అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్లో చేపడుతున్న ఉచిత సభ్యత్వ నమోదును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా యూనివర్సల్ ఐడెంటిఫికేషన్తో 12అంకెలు గల ఈ-శ్రమ్ గుర్తింపుకార్డు ఉండాలని అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ఇది వరకే రిజిస్ట్రేషన్ చేసుకున్న కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా ఐడీ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా 16 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్నవారు వచ్చే నెల 31లోపు కార్మికులు ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ, ఉపాధి రంగాలలో పనిచేసే చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, మేస్త్రీ, భవన నిర్మాణ పనులు, లారీ, ఆటోడ్రైవర్లు పలు పనులు చేసేవారు నమోదు చేసుకోవచ్చని అన్నారు. నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఏడాది పాటు ప్రమాదవశాత్తు ఏదైనా మరణం సంభవించిన, అంగవైకల్యం కలిగిన రూ. 2లక్షల ప్రమాదబీమా, ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ. 1లక్ష బీమా కల్పించబడునని అన్నారు.
అసంఘటిత కార్మిక రంగాల్లో పనిచేస్తూ ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు లేనివారు ఈ-శ్రమ్ పథకంలో అర్హులుగా పరిగణిస్తారన్నారు. ఆధార్కార్డుతో అనుసంధానమైన ఫోన్ నంబర్ కలిగినవారు ఈ పోర్టల్లో నమెదుకాగానే కార్డులు జారీచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్వో ప్రేమలత, ఈడీఎం దేవేందర్, సీఎస్సీ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మీ సేవ సభ్యులు పాల్గొన్నారు.