వనపర్తి : అన్నదాతల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ నేతలకు వనపర్తి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వరి కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దీక్షల పేరుతో డ్రామాలు ఆడేందుకు ప్రయత్నించిన హస్తం నేతలపై రైతన్నలు తిరుగుబాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందన్న కాంగ్రెస్ నాయకులకు రైతులు బుద్ధి చెప్పారు.
కొత్తకోట మండలం రామకృష్ణాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దీక్ష చేపట్టేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ దీక్షను రైతులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ మాదిరిగా ధాన్యం కొనుగోళ్లు చేసి ఉంటే బాగుండు అని రైతులు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నదని, ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ అద్భుతంగా కొనసాగుతోందని రైతులు పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలతో పాటు అన్నదాతలకు అండగా ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ధాన్యం కొనుగోళ్లు చేసి రాష్ర్ట ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందన్నారు. సాగుకు సరిపడా నీళ్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని రైతులు తేల్చిచెప్పారు. రైతు చనిపోయిన వారం రోజులలోపే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియాను సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. రైతులకు మేలు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని రైతులు ఉద్ఘాటించడంతో కాంగ్రెస్ నేతలు అక్కడ్నుంచి మెల్లగా జారుకున్నారు.