అటవీ జంతువులపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి
వేసవిలో దాహార్తి తీర్చేందుకు నీటి కుంటలు
అవసరాన్ని బట్టి సోలార్ బోర్ల ఏర్పాటు
వేటగాళ్లను కట్టడి చేసేందుకు సీసీ కెమెరాలు
అటవీప్రాంతంపై నిఘాకు బేస్క్యాంపులు
లక్ష్మీదేవిపల్లి, మార్చి 31: అడవి జంతువుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వన్య ప్రాణుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నది. అరుదుగా ఉండే జంతువులకు రక్షణ కవచంలా ఉండేందుకు అటవీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా కిన్నెరసాని వైల్డ్లైఫ్, భద్రాచలం ఫారెస్ట్ బేస్క్యాంప్లు ఏర్పాటు చేశారు. వేసవిలో జంతువులకు తాగునీటి ఎద్దడి లేకుండా ఎక్కడికక్కడ సాసర్ పిట్స్, చెక్డ్యామ్లు, వాగులు, సోలార్ పంపు సెట్ల ద్వారా నీటి వసతి కల్పించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
రోజురోజుకూ అంతరించిపోతున్న అటవీ విస్తీర్ణం, వన్య ప్రాణులను సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణపై దృష్టి సారించారు. అరుదుగా ఉండే కొన్ని జంతువులను కాపాడుకోవడం కోసం ఆ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ముఖ్యంగా కిన్నెరసాని వైల్డ్లైఫ్, భద్రాచలం అటవీ ప్రాంతాల్లో జంతువుల పరిరక్షణ కోసం అటవీశాఖ అధికారులు బేస్క్యాంప్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు జంతువుల సంరక్షణ కోసం చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుత వేసవిలో జంతువులకు తాగునీటి ఎద్దడి లేకుండా ఎక్కడికక్కడ సాసర్ పిట్స్, చెక్డ్యామ్లు, చెరువులు, వాగులు, సోలార్ పంపుసెట్ల ద్వారా నీటి వసతి కల్పించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో కార్చిచ్చు వ్యాపించకుండా మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. అడవుల్లో వన్యప్రాణులపై వేటగాళ్లు దాడులు చేయకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అడవుల్లో ఏయే జంతువులు ఉన్నాయో పరిశీలిస్తున్నారు. ఆయా జంతువులపై దాడులు జరిగితే వెంటనే గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
జంతువుల స్థావరంగా గుండ్లమడుగు
జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్ల సెక్షన్, చాతకొండ రేంజ్, కిన్నెరసాని డివిజన్, గుండ్లమడుగు అటవీ ప్రాంతం వన్యప్రాణుల స్థావరంగా మారింది. 2011-12లో ఆక్రమణకు గురైన సుమారు 700 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అటవీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ జంతువుల సంరక్షణతోపాటు అభివృద్ధి కోసం చర్యలు చేపట్టారు. అధికారుల కృషితో ఇక్కడ అడవి మొత్తం పూర్వపు స్థాయికి చేరుకోవడంతో నిరుడు ఈ ప్రాంతంలో అడవి దున్నలు సంచరిస్తూ కెమెరాలకు చిక్కాయి. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేసవిలో జంతువుల కోసం నీటి వసతి కల్పించడంతో ఈ జంతువులు గ్రామాల్లోకి వెళ్లకుండా అక్కడే దాహార్తిని తీర్చుకుంటున్నాయి. కిన్నెరసాని వైల్డ్లైఫ్, భద్రాచలం అటవీ ప్రాంతాల్లో అడవి దున్నలు, దుప్పులు, జింకలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు, విషసర్పాలు, కోతులు, కొండముచు ్చలు, వివిధ రకాల పక్షులు ప్రస్తుతం ఉన్నాయి.
నీటి తొట్లు ఏర్పాటు
వేసవిలో జంతువులు దాహార్తితో అలమటిస్తూ నీటి కోసం గ్రామాల వైపు వెళ్లి గ్రామస్తుల చేతిలో దాడులకు గురవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు, జంతువుల దాహార్తిని తీర్చేందుకు అటవీ అధికారులు పలు ప్రాంతాల్లో నీటి తొట్లు (సాసర్ పిట్స్) ఏర్పాటు చేశారు. వీటిలో చిన్న జంతువులు కూడా స్వేచ్ఛగా నీరు తాగేలా భూమిలో చతురస్రాకారంగా, గుండ్రంగా తక్కువ ఎత్తులో ఉన్నాయి. వారానికి ఒకటి రెండుసార్లు నీరు నింపుతారు. అడవి మధ్యలో ఎండకాలంలో వన్య ప్రాణాలు దాహార్తిని తీర్చేందుకు నీటిని నిల్వ చేయడానికి వాటర్రింగ్స్నూ ఏర్పాటు చేశారు. సుమారు 120 సోలార్ బోర్లు కూడా ఏర్పాటు చేసి పర్చ్యులేషన్ ట్యాంక్ల్లోకి నీరు వదులుతున్నారు.
ఇవి కూడా చుడండి
రేపటి నుంచి పంజాబ్ మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం
ముఖేష్ ఇంటి ముందు వాహనం నిలిపింది వాజే డ్రైవర్: ఎన్ఐఏ