కుత్బుల్లాపూర్, మే1: కరోనా విళయతాండవం చేస్తున్నది. ఏమాత్రం ఆదమరిచినా తన పంజా విరుసుతున్నది. ఈ విపత్కర సమయంలో ప్రజల యోగక్షేమాలు, కాలనీల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకునేందుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. టెలికాన్ఫరెన్స్లో ప్రతి కాలనీలో ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకునేందుకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే శనివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని న్యూవివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సుమారు 200 మందితో కాలనీలో నెలకొన్న సమస్యలతో పాటు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో ప్రజలు విచ్చలవిడిగా బయట తిరగకుండా నియమనిబంధనలను పాటించి తగు చర్యలు తీసుకుంటే కరోనా దరి చేరకుండా ఉంటుందన్నారు. కాలనీల్లో ఇప్పటికే పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని, దీనికి తోడు సోడియం హైపోక్లోరైట్ వంటి ద్రావణాన్ని విచ్చలవిడిగా పిచికారీ చేయించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు వివరించారు. కాలనీల్లో పలు అభివృద్ధి నిర్మాణ పనులను శంకుస్థాపన చేసుకోవాల్సిన అవసరం ఉందని, కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. సకాలంలో కాలనీల్లో మరిన్ని మౌలిక వసతుల కల్పన కోసం తగు చర్యలు తీసుకుంటామని, ప్రజలందరిని చైతన్యవంతులను చేసేందుకు అసోసియేషన్ ప్రతినిధులు వారధులుగా పని చేసి కరోనా నుంచి ప్రజలను రక్షించాలని కోరారు.