కీసర, జూలై 21: కులవృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండి ఆసరాగా నిలుస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి గోధుమకుంటలో బుధవారం 44 యూనిట్లకు గాను 924 గొర్రెలను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నదన్నారు. గొల్ల కురుమలకు బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నామన్నారు. ఇక ఎస్సీల అభ్యున్నతి కోసం ఇటీవల సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టాడన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతి నెల పంచాయతీలకు, మున్సిపాల్టీలకు, కార్పొరేషన్లకు నిధులను నేరుగా అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, గోధుమకుంట సర్పంచ్ మహేందర్రెడ్డి, ఎంపీటీసీ కిరణ్జ్యోతి, పశువైద్యాధికారులు, డాక్టర్లు పి. శేఖర్, శ్యామల, ఉప సర్పంచ్ ఆంజనేయులు, ఏఎంసీ డైరెక్టర్ సురేశ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గోధుమకుంటలో నిర్వహించిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ మహేందర్రెడ్డి, ఎంపీపీ, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.