మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 8 : తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు అర్హులైన వారందరికీ లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించినట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2021- 2023 కొత్త ఎక్సైజ్ (ఆబ్కారీ) విధానంలో రిటైల్ మద్యం దుకాణాల ఎంపికను సోమవారం లాటరీ పద్ధతిలో చేపట్టారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు రిజర్వేషన్తోపాటు గిరిజనులు, గిరిజనేతరులకు మరో 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు అందుకు అనుగుణంగా దుకాణాల కేటాయింపును లాటరీ పద్ధతిన ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మేడ్చల్ యూనిట్ పరిధిలో 114 మద్యం దుకాణాలకు గాను ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు 5, గౌడ కులస్తులకు 11 దుకాణాలను, మల్కాజిగిరి యూనిట్ పరిధిలోని 88 మద్యం షాపులకు గాను ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు 7, గౌడ కులస్తులకు 12 దుకాణాలను లాటరీ పద్ధతిన కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీఆర్ఓ టింగ్యా నాయక్, ఎక్సైజ్ అధికారులు, జిల్లా బీసీ, ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.