మేడ్చల్, మే 10 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఇంటింటి జ్వర సర్వే సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలో కొనసాగింది. ఇంటి వద్దకే సిబ్బంది వచ్చి పరీక్షలు చేయడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలు, మండలాల్లో పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ సర్వేతో ఎక్కడికక్కడే పరీక్షలు చేసి మందు లు ఇవ్వడంతో దవాఖానకు పోయే ఇబ్బందులు తప్పాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటింటి జ్వర సర్వే చేస్తున్న సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించి ఆరోగ్య సమస్యలు ఉంటే తెలుపాలని మేడ్చ ల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికానర్సింహారెడ్డి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రాంచందర్, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా 23వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ కౌడె మహేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేను పరిశీలించారు.
ఘట్కేసర్, మే 10 : ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ సూచించారు. ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమాన్ని ఘట్కేసర్ మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్ శ్యాంసన్ పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని 11 వార్డు లో మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గ సభ్యులతో కలిసి సర్వేలో పాల్గొని ఇంటింటికీ సేకరిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కుటుంబంలోని వ్యక్తులకు జ్వర పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ పావనీజంగయ్య యాదవ్, కమిషనర్ వసంత, మేనేజర్ శ్రీధర్రెడ్డి, కౌన్సిలర్లు మల్లేశ్, అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు.
కీసర,మే10: కీసర మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది కలిసి జ్వర పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంటికొచ్చిన వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించి జ్వర పరీక్షలను చేయించుకోవాలని గోధుమకుంట సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి సూచించారు.
బోడుప్పల్, మే 10 : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో 15 టీంలతో 3113 మందికి జ్వర పరీక్షలు నిర్వహించగా అందులో 24మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా వారికి మెడికల్ కిట్లు అందజేశారు.
మేడ్చల్ రూరల్, మే 10 : మేడ్చల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మండల వైద్యాధికారి డాక్టర్ నళిని ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది. 14 బృందాలు 418 కుటుంబాలను సర్వే చేశారు. 57 మందికి కరోనా కిట్లు అందజేశారు.