మేడ్చల్, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): దళితవాడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి గ్రామంలోని దళితవాడలను ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రణాళికను రూపొందించనున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని దళితవాడల్లో ఉన్న సమస్యలను అధికారులు గుర్తించే విధంగా అధికారుల బృందాలు పర్యటిస్తున్నాయి. ఈ బృందాలు దళితవాడల్లోని సమస్యలను అక్కడి ప్రజల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో అధికారుల పర్యటన పూర్తయిన తర్వాత అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. ప్రతి దళితవాడలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు. సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, కమ్యూనిటీ హాల్ భవనాలు నిర్మించనున్నారు. ఇటీవల ప్రారంభమైన దళితవాడల సందర్శనలో భాగంగా 20 గ్రామాల్లో సమస్యలను గుర్తించారు. మిగతా గ్రామాల్లో ఉన్న సమస్యలను త్వరలోనే గుర్తించి ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఎన్ని నిధులైన ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దళితవాడలను ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రభుత్వ ప్రణాళికపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సమస్యలను గుర్తించి పరిష్కరిస్తాం..
జిల్లాలోని అన్ని గ్రామాల దళితవాడల సమస్యలను ప్రత్యేక అధికార బృందాలు గుర్తిస్తున్నాయి. ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారులు స్వయంగా ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటున్నారు. సమస్యలను గుర్తించిన తర్వాత అభివృద్ధి పనుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పిస్తాం. గ్రామాల్లో సమస్యల గుర్తింపు పూర్తయిన వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం.