సంగారెడ్డి, ఆగస్టు 2 : సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్పై జడ్పీటీసీలకు ఎలాంటి అసంతృప్తి లేదని, కుటుంబ సభ్యులుగా అందరం కలిసిమెలిసి ఉన్నామని జడ్పీ వైస్ చైర్మన్ కుం చాల ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు సుధాకర్రెడ్డితో కలిసి మాట్లాడారు. జడ్పీ చైర్పర్సన్తో సభ్యులందరూ చర్చించుకుని నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా బినామీ పేర్లపై జడ్పీ నిధులు మళ్లించి పనులు చేస్తున్నారనే వార్తలు నిజం కాదన్నారు. కేవలం రూ.5లక్షలు వరకు నామినేషన్ పద్ధతిన పనులు చేస్తున్నామన్నారు. రూ.5 లక్షలు దాటిన పనులకు టెండర్లు వేసి అప్పగించి అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. దుబాయ్ టూర్కు వెళ్లడానికి సొంత నిధులు ఖర్చుచేసుకుని విహారయాత్ర చేశామన్నారు. జడ్పీ నిధులతో టూర్ చేశారని, కొంత మంది సభ్యులు అసంతృప్తితో ఉన్నందున టూర్కు వెళ్లినట్లు వచ్చిన వార్తలు నిజం కావన్నారు. గతంలో జరిగిన పరిణామాలతో చైర్పర్సన్, జడ్పీటీసీల మధ్య అసంతృప్తి పెరిగిందని, అవిశ్వాసం వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న వార్త్తలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో జడ్పీటీసీలు స్వప్న, అరుణ, రమేశ్, అపర్ణ, నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి, ఆంజనేయులు, నాయకులు రవీందర్నాయక్, మనోహర్గౌడ్ పాల్గొన్నారు.
అవిశ్వాసంపై ఆలోచనే లేదు
జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు సుధాకర్రెడ్డి
సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టేందుకు జడ్పీటీసీలు ఆలోచనలో ఉన్నట్లు వచ్చిన వార్తలు నిరధారమని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు సుధాకర్రెడ్డి కొట్టిపారేశారు. కలలో కూడా అలాంటి ఆలోచన లేదని, అభివృద్ధిపై ప్రతి విషయాన్ని చైర్పర్సన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బుజ్జగింపులకే దుబాయ్ టూర్కు వెళ్లినట్లు పూర్తిగా అవాస్తవమన్నారు. ఏడాదిన్నర క్రితమే ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావుకు టూర్ విషయం తెలియజేశామన్నారు. కరోనా నేపథ్యంలో టూర్ను వాయిదా వేశామన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్కు వెళ్లి వస్తామని మరోసారి గుర్తుచేయడంతో దుబాయ్ వెళ్లిరండి అంటూ మంత్రి సూచించినట్లు తెలిపారు. దీంతో గత నెల 23న వెళ్లామన్నారు. జడ్పీ చైర్పర్సన్తో విభేదాలు ఉన్నందుకే దుబాయ్ టూర్కు వెళ్లినట్లు వార్తలు ప్రచురించడంతో సభ్యులను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులను ఎక్కడా కూడా వినియోగించలేమని, తమ తమ సొంత నిధులతో టూర్కు వెళ్లామన్నారు. సభ్యులందరూ సఖ్యతగా ఉన్నామని, ఎవరికి కూడా అవిశ్వాసం పెట్టే ఆలోచన లేదని మరోసారి స్పష్టం చేస్తున్నామని సుధాకర్రెడ్డి వెల్లడించారు.