జహీరాబాద్ : పట్టణ మున్సిపాలిటీని మరోసారి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని జహీరాబాద్ ( Zahirabad ) ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు( MLA Manikya Rao) ధీమాను వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని 15, బసవేశ్వర్ స్ట్రీట్ , 28 వ వార్డుల్లోని ఆర్యనగర్లల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉల్లిగడ్డ పద్మజా , మడపతి శివ కుమార్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో సాధ్యంకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలు ఎక్కడ అని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోయి గోసపడొద్దన్నారు.
బీఆర్ఎస్ పాలన ఎట్లుండే.. ఇప్పుడెట్లున్నది ఒకసారి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో పట్టణ అభివృద్ధికి విధులు కేటాయించలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు రంగులేసి మేమే చేసినామని గప్పాలు కొడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి దేవి ప్రసాద్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు .