Matka | జహీరాబాద్,జనవరి 24: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం మట్కాకు అడ్డాగా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున జహీరాబాద్ డివిజన్లోని గ్రామాల్లో జోరుగా మట్కా సాగుతోంది. న్యాల్కల్ మండలంలోని రాజోల మట్కాకు అడ్డాగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. మట్కా నివారించడంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జహీరాబాద్ పట్టణ ఎస్సై ఆధ్వర్యంలో వారంలో ఇద్దరిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.2.20లక్షలు స్వాధీనం చేసుకుని ఇద్దరి సెల్ఫోన్లు సీజ్ చేశారు. న్యాల్కల్ మండలం మట్కా, పత్తాలాటకు అడ్డాగా మారినా అక్కడి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద అడ్డాలు ఏర్పాటు చేసి పత్తాలాట, మట్కా నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని పోలీస్శాఖపై ఆరోపణలు వస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మట్కా నిర్వాహకులు రాజకీయ నాయకులు, పోలీసులు, కొందరి అండదండలతో మట్కా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎంతో మంది పేదలు మట్కా ఆడి నష్టపోతుండగా.. నిర్వాహకులు మాత్రం ప్రతిరోజు రూ. లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. జహీరాబాద్ డివిజన్లో ప్రతిరోజు మట్కా డబ్బులు పెద్దఎత్తున చేతులు మారుతున్నాయి. రాత్రి వరకు జరిగే నంబర్ల ఆటకు రూపాయికి రూ.80 చెల్లిస్తుండగా, పాన్ నంబర్ పేరిట క్లోజింగ్ నంబరుకు జరిగే జూదానికి రూపాయికి ఎనిమిది రూపాయలు చెల్లిస్తున్నారు. ఓపెనింగ్, క్లోజింగ్ అంకెలంటూ మట్కా జడలు విప్పుతోంది. మట్కా వ్యసనం బారినపడి అనేక మంది పేదలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తక్కువ డబ్బులతో ఎక్కువ సంపాదించవచ్చన్న ఆత్యాశతో పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ధనికులు సైతం ఈ వ్యసనానికి అలవాటు పడి ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు.
కాలానుగుణంగా మట్కా నిర్వాహకులు కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. గతంలో మట్కా నిర్వాహకులు రహస్య ప్రాంతాల్లో ఉండి కాగితాలపై నంబర్లు రాసుకునే వారు.నంబర్లు రాసిన కాగితాలను ప్రధాన నిర్వాహకులు తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా ఆన్లైన్ వేదికగా దందాను నిర్వాహకులు నడిపిస్తున్నారు.కొంతమంది నిర్వాహకులు కొన్నిచోట్ల చిట్టీల్లో నంబర్లు రాసుకుంటుండగా, మరికొందరు సెల్ఫోన్ ద్వారా ఆడుతున్నారు. సెల్ఫోన్లో చెప్పిన నంబరును నిర్వాహకులు నమోదు చేసుకుంటున్నారు. డబ్బులు చెల్లింపులు సైతం ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా మట్కా నడపిస్తున్నారు.
జహీరాబాద్, న్యాల్కల్ మండలాలకు చెందిన మట్కా నిర్వాహకులు జిల్లాలో పలువురితో సంబంధాలు పెట్టుకుని నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మట్కా కొన్ని గ్రామాలకే పరిమితం కాగా, ప్రస్తుతం మరిన్ని గ్రామాలకు విస్తరిస్తోంది. జహీరాబాద్ పట్టణంలో సుభాష్గంజ్, శాంతినగర్, అల్లీపూర్, పస్తాపూర్, హౌసింగ్ బోర్డు కాలనీ, నాగులకట్ట, అల్లాన ఫ్యాక్టరీ సమీపంలో మట్కా నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. న్యాల్కల్, ఝరాసంగం,కోహీర్, మొగుడంపల్లి మండలాల్లో మట్కా విస్తరించిందనే ఆరోపణలు ఉన్నాయి. నిర్వాహకులు రహస్య ప్రాంతాలను ఎంపిక చేసుకుని నిర్వహిస్తున్నట్లు సమాచారం. న్యాల్కల్ మండలంలోని రాజోల కేంద్రంగా మట్కా నడుస్తున్నట్లు తెలిసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు చిన్న చిన్న మట్కా నిర్వాహకులను పట్టుకుని అరెస్టు చేస్తున్నారనే తప్ప పెద్ద నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన నిర్వాహకులను అరెస్టు చేసేందుకు పోలీసులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. జహీరాబాద్ డివిజన్లో మట్కా నిర్వాహకులను అరెస్టు చేసిన వివరాలు పోలీసులు వెల్లడించడం లేదు. అంతా గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో పలు అనుమానాలకు దారితీస్తున్నది.
జహీరాబాద్ డివిజన్లో మాట్కాను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మాట్కా పై ప్రత్యేక నిఘా పెట్టాం. మాకు అందిన సమాచారంతో దాడులు చేసి నిర్వాహకులను అరెస్టు చేస్తున్నాం. ప్రధాన నిర్వాహకులపై నిఘా ఉంచాం. ఆన్లైన్లో మాట్కా నిర్వహణ చేయడంతో నిర్వాహకులను అరెస్టు చేసేంనుకు ఆవకాశం లేకుండ పోయింది. జహీరాబాద్ పట్టణంలో మాట్కా నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేశాం. న్యాల్కల్లో మండలంలో మాట్కా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.