మెదక్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో వారు పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడంతోపాటు దేశ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు నెహ్రూ యువ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నెహ్రూ యువ కేంద్రం మెదక్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి నైబర్ హుడ్ యూత్ పార్లమెంట్ (NYLP) 2024 కార్యక్రమాన్ని పట్టణంలోని వైస్రాయ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ భారత రాజ్యాంగం, చట్టాలపై మెరుగైన జ్ఞానం, అవగాహన, ప్రపంచవ్యాప్తంగా జాతీయ యువజన పార్లమెంట్లు క్రియాశీల-పౌరసత్వాన్ని ప్రోత్సహించడానికి విశ్వసనీయ యంత్రాంగాలుగా ఉద్భవించాయని తెలిపారు. యువత పార్లమెంటరీల నిర్మాణం, కూర్పు, నిర్వహణ విధానాల్లో తేడాలు ఉన్నప్పటికీ, యువతకు నిర్దిష్టమైన యువత సంబంధిత సమస్యలు, ముఖ్యంగా జాతీయ ప్రాముఖ్యత ఉన్న విషయాలపై వారి దృకోణాలను పంచుకోవడానికి ఆందోళనలను వ్యక్తీకరించడానికి వేదికలను అందిస్తుందన్నారు.
రాష్ట్ర స్థాయి జాతీయ యువ పార్లమెంట్ ఫెస్టివల్లో తెలంగాణ నుంచి ద్వితీయ స్థానం గెలుపొందిన కుమారి నివేదితను కలెక్టర్ రాజర్షి షా ప్రశంసించి సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చుతున్న వివిధ విధానాలు, సంసరణలు, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా యువజన శాఖ అధికారి రంజిత్ రెడ్డి, జడ్పీసీఈవో ఎల్లయ్య, డీఆర్డీఏ శ్రీనివాస్రావు, సూపరింటెండెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ శ్రీహరి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ నాగరాజు, జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి బ్రహ్మాజీ, ఉమ్మడి మెదక్ జిల్లా కార్యక్రమ అధికారి కిరణ్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్, ఏఆర్ఈఎస్ ఎన్జీవో సునీత, సఖి వన్ స్టాప్ సెంటర్ రేణుక, ప్రొఫెసర్ వెంకటేశం, ప్రొఫెసర్ శరత్ రెడ్డి, ఎన్సీసీ ఏఎన్వో సుధాకర్, యువజన సంఘం అధ్యక్షుడు అధికం రాజు గౌడ్, ఎన్వైకే వలంటీర్లు సాయిరాం, చరణ్ పాల్గొన్నారు.