రామాయంపేట/ చేగుంట, ఫిబ్రవరి 16: మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై.నర్సింహులు కథనం ప్రకారం.. నార్సింగి మండల కేంద్రానికి చెందిన వివాహిత తోట కల్పన (20) బంధువుల వద్ద అదే గ్రామానికి చెందిన ఎండీ ఖలీల్ (25) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వీరిరువురు కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
ఈ విషయం తెలిసిన కల్పన తల్లిదండ్రులు దౌల్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన వ్యక్తితో ఆమెకు మూడు నెలల క్రితం వివాహం చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ కల్పన మూడు రోజుల క్రితం అత్తారింటి నుంచి తల్లిగారింటికి వచ్చేసింది. అదే రోజు ఖలీల్ బైక్పై నార్సింగి నుంచి రామాయంపేటకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారి స్వగ్రామం నార్సింగి చెరువు వద్ద వారిద్దరు చెప్పులు, బైక్ను చెరువు గట్టుపై వదిలి, అందులోనే దూకి ఆత్మహత్మకు పాల్పడ్డారు. వారు కనబడుట లేదని ఇరు కుటుంబీకులు వారి ఆచూకీ కోసం వెతికి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నార్సింగి చెరువు గట్టుపై చెప్పులు, బైక్ ఉన్న విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. చెరువులో గజ ఈతగాళ్లతో ఈనెల 14న గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గురువారం స్థానిక చెరువులోనే కల్పన, ఖలీల్ మృతదేహాలు తెలాయి. దీంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీసి అక్కడే పంచనామా చేసి, పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.