మెదక్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : ఏడుపాయల్లో మూడు రోజుల పాటు మహా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. మహా శివరాత్రి సందర్భంగా ఏడుపాయల్లో నిర్వహించే ఉత్సవాలకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, జాతర ప్రారంభిస్తారన్నారు.
ఈ జాతరకు రాష్ట్రంతో పాటు పక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్థం ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే షాపింగ్ కాంప్లెక్స్, భవిష్యత్తు లో భక్తుల వసతి కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నామన్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం సింగూర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి రోజు ఉపవాస దీక్షలు, రెండో రోజు శకట భ్రమనోత్సవం, మూడో రోజు రథోత్సవంతో జాతర ముగుస్తుందన్నారు. 2014 కంటే ముందు ఏడుపాయల దేవాలయ సంవత్సర ఆదాయం రూ.కోటిన్నర ఉంటే ప్రస్తుతం ఏడాదికి రూ.ఎనిమిది కోట్లకు పెరిగిందన్నారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని క్షేమంగా తిరిగి వెళ్లాలని కోరారు.