మెదక్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ), యాదా ద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి నిత్య పూజలు కోలాహలంగా సాగుతున్నాయి. శుక్రవారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరు కల్యాణోత్సవం, మొక్కు బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగగా, భక్తులు పాల్గొని తరించారు. సాయంత్రం స్వామి, అమ్మవారికి ఉభయ జోడుసేవలు, దర్భార్ సేవలు నిర్వహించారు. స్వామివారి ఉభయ దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఖజానాకు రూ.19,30,050 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అడిషనల్ డి ప్యూటీ కంట్రోలర్, ఆడిట్ జనరల్ రాజ్వీర్సింగ్, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ ఏజీ రవిదాస్ పట్టార్, హైదరాబాద్ ఆడిట్ డైరెక్టర్ జనరల్ సి.శైలజ, రాష్ట్ర డి ప్యూటీ ఆడిట్ జనరల్ సంజయ్ కామినేని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో హవేళిఘనపూర్ మండల ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, చిన్నంరెడ్డి, గోవిందరెడ్డి, నర్సింహారెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్ పాల్గొన్నారు.