సిద్దిపేట అర్బన్, మార్చి 1: కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర పెంచడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు చౌరస్తాలో నిరసన చేపట్టారు. పదే పదే గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుల బతుకులు ఛిద్రం చేస్తున్నారంటూ.. కట్టెల పొయ్యిపై వంట చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మోదీ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పాటు బతుకమ్మ ఆడి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు.
మహిళలు రోజూ వినియోగించే గ్యాస్ ధరను ఒక్కరోజులో రూ.50కి పెంచడం సరికాదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన సమయం ఆసన్నమైందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని.. లేనిపక్షంలో మహిళలంతా ఏకమై తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వంట గ్యాస్తో పాటు నిత్యావసర ధరలు తగ్గించాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి మహిళల సత్తా ఏమిటో చూపిస్తామని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు పాల్గొన్నారు.