శివంపేట జూలై 7: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మొదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్ బూలి (50) శివంపేటలోని ఓ టిఫిన్ సెంటర్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది.
ప్రతిరోజు లాగే బూలి శివంపేటలో తన పని ముగించుకొని సాయంత్రం ఇంటికి బయలుదేరి గురువారం ఉదయం శివంపేట పెద్ద చెరువు కట్ట సమీపంలో శివమై తేలింది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఎస్సై రవికాంతరావు తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సిబ్బంది వచ్చి పలు ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. అనంతరం శవాన్ని నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బూలికి భర్త చనిపోగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.