సంగారెడ్డి, మే 8 : అన్నదాతలు అరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో విక్రయించాలని అలాగే మూడు రోజుల్లో అమ్మకం నిధులు ఖాతాలో జమ చేస్తారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ రైతులకు సూచించారు. సోమవారం సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్పేట, నాగపూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలని కోరారు.
ప్రభు త్వం ఇప్పటికే ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన విషయం రైతులకు తెలిసిందేనన్నారు. కేంద్రాల్లో వర్షం వచ్చినప్పుడు ధాన్యం తడవకుండా టర్పాలీన్లు అందుబాటులో ఉన్నాయని, తూకం వేసిన వెంటనే టాబ్ ఎంట్రీలో నమోదు చేసి సకాలంలో రైతులకు అమ్మిన ధాన్యం సొమ్ము వచ్చే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా సమీపంలో తూకం వేసి కొనుగోలు చేస్తుందన్నారు. తేమ శాతం లేకుండా రైతులు జాగ్రత్తగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2060లు, కామన్ గ్రేడ్ ధాన్యానికి రూ. 2040లకు కొనుగోళ్ల చేస్తున్నారన్నారు.
ఒకవేళ తేమశాతం ఉంటే వెంటనే సమీపంలోని కల్లాల్లో అరబెట్టి అమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యమ్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాగపూర్ పీఏసీఎస్ చైర్మన్ రాంగోపాల్, సర్పంచ్ అమృత రాజు,జడ్పీటీసీ సునీత, ఎంపీటీసీ సభ్యలు మౌనిక, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, డైరెక్టర్లు సంజీవరెడ్డి, దశరథ్రెడ్డి, రాములు, ప్రభు, రాంచందర్, మనీష్గౌడ్, నాయకులు ఆర్. వెంకటేశ్వర్లు, చిల్వరి ప్రభాకర్, మనోహర్గౌడ్, గోనెల రఘు, మండల వ్యవసాయ అధికారి ప్రసాద్, మానిటరింగ్ అధికారి నర్సింహారెడ్డి రైతులు పాల్గొన్నారు.