జై బోలో గణేశ్ మహారాజ్కీ జై..అంటూ నినాదాలు. గణపతి బొప్పా మోరియా అంటూ.. ఉత్సాహంగా యువతీయువకులు ఆటపాటల నడుమ గణేశ్ నిమజ్జనాలను ఉత్సాహంగా నిర్వహించారు. పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తులు గురువారం నిమజ్జనాలకు తరలించారు. దారిపొడవునా శోభాయాత్రలతో సందడి నెలకొంది. ఎక్కడచూసినా డప్పుల దరువు, డీజేల హోరుతో చిన్నాపెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
పలు సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో తాగునీరు, ప్రసాదం పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని విగ్రహాలను మహబూబ్సాగర్ చెరువుకు తరలించగా, మిగతా ప్రతిమలను ఆయా గ్రామాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. నిరంతరం నిఘా పెడుతూ, శోభాయాత్రలను వీడియో రికార్డింగ్ చేయించారు. నిమజ్జనంలో ప్రజాప్రతినిధులు పాల్గొని యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు.
– మెదక్/ సంగారెడ్డి, న్యూస్ నెట్వర్క్, సెప్టెంబర్ 28