మెదక్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సంచార జాతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ దక్షిణ భారత అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యుడు తుర నరసింహ అన్నారు. జిల్లాలో డీనోటి ఫైడ్, సంచార జాతుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో సంక్షేమ అధికారులు, అటవీ, మైన్స్, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు జ్యోతిబాఫూలే, అంబేదర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం సంచార జాతుల అభ్యున్నతికి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ, వాటి పర్యవేక్షణకు బోర్డు ఏర్పాటు చేసిందన్నారు.
70 ఏండ్ల దేశ చరిత్రలో ఇప్పటికీ సమాజంలో అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పలు ఉప కులాల వారిపై చిన్నచూపు చూస్తున్నారన్నారు. వారికి రాజ్యాంగ ఫలాలు అందడం లేదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తున్నదన్నారు. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో సంచార జాతుల వారు నివసిస్తున్నారో గుర్తించి వారికి అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వృత్తి నైపుణ్యాభివృద్ధి, తదితర రంగాల్లో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జాతీయ ఎస్సీ ఆర్థిక అభివృద్ధి సంస్థ నిధులు అందిస్తున్నదన్నారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా కార్యక్రమాలు రూపొందించాల్సినదిగా సూచించారు. ప్రతి మండలంలోని గ్రామాల వారీగా డీఅండ్సీ కేటగిరీల్లో ఉన్న జనాభా వివరాల జాబితా అందించాల్సిసిందిగా బీసీ అభివృద్ధి అధికారికి, ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా లబ్ధి చేకూర్చిన వివరాల జాబితా అందజేయాల్సిందిగా ఎస్సీ అభివృద్ధి అధికారులకు సూచించారు. సంచార జాతుల వారికి సామాజిక న్యాయం చేకూరేలా మానవత్వంతో పనిచేయాలన్నారు. ఏ వ్యవస్థ బాగుండాలన్నా విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, అప్పుడే మానవ విలువలు బాగుంటాయని, లేకుంటే అన్ని వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని అన్నారు.
అటల్ బీహారీ టింకర్ యోజన కింద పాఠశాలలో ల్యాబ్ల ఏర్పాటుకు రూ.10 లక్షల వరకు సాయం పొందవచ్చని, కావాల్సిన పాఠశాలలు నివేదికలు ఇవ్వాల్సిందిగా సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏమైనా నమోదయ్యాయా, నష్టపరిహారం చెల్లించినట్లయితే సమగ్ర నివేదిక అందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నేరాలు చేసిన వారిలో సంచార జాతుల వారిని గుర్తించి వివరాలు అందజేయాలని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి నేర ప్రవృత్తిని తగ్గించాలని, వారికి పునరావాసం కల్పించాలని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో సాయిరామ్, డీఎస్పీ సైదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధికారులు విజయలక్ష్మి, కేశూరం, జెంలానాయక్, మైన్స్ ఏడీ జయరాజ్, డీఎఫ్వో రవి ప్రసాద్, డీఈవో రమేశ్కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.