అందోల్, జనవరి 5: ప్రజల వద్దకే ప్రభుత్వపాలనను తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 17, 18 వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ పాలన తరహాలోనే పరిపాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రజల సమక్షంలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తూనే అందోల్ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసామ్తన్నారు. అందోల్-జోగిపేట కన్నతల్లిలాంటిదని ఇక్కడి ప్రజలకు ఏ కష్టం రాకుండా చూస్తానని చెప్పారు. అన్ని వార్డుల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తానని అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అనంతరం జోగిపేట ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేసిన మంత్రి వార్డుల్లో తిరుగుతూ పేషెంట్లు, వారి బంధువులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యసేవలు, కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. దవాఖాన సూపరింటెండెంట్ రమే శ్ మంత్రిని శాలువాతో సన్మానించి అందిస్తున్న వైద్యసేవలను వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో పాండు, జడ్పీసీఈవో ఎల్లయ్య, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు సురేందర్ గౌడ్, చిట్టిబాబు, రేఖాప్రవీణ్, శివశంకర్, రంగ సురేశ్, నాగరాజు, దుర్గేశ్, హరికృష్ణ గౌడ్, చెందర్నాయక్, మాజీ ఎంపీటీసీ డాకూరి వెంకటేశం పాల్గొన్నారు.
వట్పల్లి, జనవరి 5 : అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మం త్రి దామోదర రాజనరసింహ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంతోపాటు మంచిర్యాల తండా, పోతులబోగుడలో ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వట్పల్లి ప్రజాపాలనలో మంత్రి మాట్లాడుతూ..అభయహస్తం పథకంతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతుందన్నారు. ఒక్క దరఖాస్తులోనే సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు ఉండటంతో అవన్నీ ఒకేసారి అమలవుతాయన్నారు. దరఖాస్తుల స్వీకరణను అధికారులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీవో పాండు, ఎంపీడీవో జగదీశ్వర్, ఎమ్మర్వో శ్రీనివాస్, ఎంపీపీ కృష్ణవేణి, సర్పంచ్ సురేఖాబుద్ధిరెడ్డి, ఎంపీటీసీ ఇందిరారాజేందర్, నాయకులు పాల్గొన్నారు.
రేగోడ్, జనవరి 5 : విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఈ నెల 9,10 తేదీల్లో నిర్వహించనున్న రోబోటిక్స్ ఎక్స్ పో, ఇన్నోవేటివ్ ఫెస్ట్ కార్యక్రమ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ ఫెస్ట్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థులు రోబోటిక్స్, సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజెస్, వోకేషనల్ సబ్జెక్టులకు సంబంధించిన నమూనాలను ప్రదర్శిస్తారని, అన్ని గ్రామాల నుంచి విద్యార్థులు, యువకులు, నాయకులు, అధికారులు, తల్లిదండ్రులు కార్యక్రమానికి విచ్చేయాలని ప్రిన్సిపాల్ జయప్రకాశ్ కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహ్మద్ ఖాజా పాల్గొన్నారు.