హుస్నాబాద్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హుస్నాబాద్ మున్సిపల్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయనకు పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్కు మెడికల్ కాలేజీ మంజూరు ఖాయమని, ఇందుకోసం స్థల పరిశీలన చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు. నిరుపేదలందరూ ఇండ్లు కట్టుకునేందుకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని తెలిపారు. హుస్నాబాద్ పట్టణాన్ని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సేవలందిస్తానని చెప్పారు.
హుస్నాబాద్, డిసెంబర్ 12: కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి హుస్నాబాద్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హుస్నాబాద్ మున్సిపల్ సమావేశ మందిరంలో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్తో పాటు పాలకవర్గం మంత్రికి ఘనస్వాగతం పలికారు. కౌన్సిలర్లు, రెవెన్యూ అధికారులు, ప్రముఖులు మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణానికి చుట్టూ 40కిలోమీటర్ల వరకు పెద్ద పట్టణం లేదని, హుస్నాబాద్ పట్టణాన్ని నగరంగా తయారు చేసి ఈ ప్రాంత ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. హుస్నాబాద్కు మెడికల్ కాలేజీ మంజూరు ఖాయమని, ఇందుకోసం స్థల పరిశీలన చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించామని తెలిపారు. హుస్నాబాద్కు మెడికల్ కళాశాల గొప్ప అచీవ్మెంట్గా మారుతుందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, అనంతరం అభివృద్ధి ఎజెండాగా పనిచేయాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని మున్సిపల్ అధికారులు, పాలకవర్గానికి సూచించారు. ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చడం, ఆరోగ్యం, వైద్యం అందుబాటులోకి తేవడం, ప్రధాన రహదారులకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, పట్టణానికి రింగ్రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. నియోజకవర్గంలోని నిరుపేదలందరూ ఇండ్లు కట్టుకునేందుకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కసరస్తు చేస్తున్నదని తెలిపారు. గౌరవెల్లి ముంపు బాధితుల సమస్యలు పరిష్కరిస్తానని, హుస్నాబాద్ పట్టణాన్ని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ఐదేండ్ల పాటు సేవలందిస్తానన్నారు.
హుస్నాబాద్లోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అక్కడ వాసవి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దవాఖాన లోపలికి వెళ్లి రోగులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరాతీశారు. దవాఖానకు కావాల్సిన సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్రెడ్డితో చర్చించారు. త్వరలోనే సకల సౌకర్యాలు గల దవాఖానగా రూపుదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, కమిషనర్ రాజశేఖర్, కౌన్సిలర్లు బోజు రమారవి, వాల సుప్రజానవీన్, బొల్లి కల్పనాశ్రీను, జనగామ రత్నరవీందర్రావు, చిత్తారి పద్మ, సరోజన, గూల్ల రాజు, గోవిందు రవి, పెరుక భాగ్యారెడ్డి, బొజ్జ హరీశ్, వల్లపు రాజు, దొడ్డి శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, పున్న లావణ్యసది, కో-ఆప్షన్ సభ్యులు అయిలేని శంకర్రెడ్డి, ఎండీ అయూబ్, లలిత, శ్రీలత, ఆర్ఐ కృష్ణ, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, నాయకులు చిత్తారి రవీందర్, ఆకుల వెంకట్, ఎండీ హసన్, దవాఖాన వైద్యులు పాల్గొన్నారు.