టీఎస్ఐపాస్ విధానంతో సీఎం కేసీఆర్ తెలంగాణలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారని, అదే సమయంలో ఓడీఎఫ్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి భారీ పరిశ్రమలు, సంస్థలను బీజేపీ సర్కారు ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పటాన్చెరు జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహించారు. వేడుకల్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల ఐటీ, ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు.
నిరంతర విద్యుత్ను అందజేస్తుండడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2,572 నూతన పరిశ్రమలు వచ్చాయని, రూ. 28,181 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు పటాన్చెరు కాలుష్య కాసారంలా ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కొల్లూర్, ఉస్మాన్నగర్లో ఐటీ పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలవారికి ఇక్కడ ఉపాధి లభిస్తున్నదని, మినీ ఇండియాగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల యాజమాన్యాలు, ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పటాన్చెరు, జూన్ 6: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చూస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ టీఎస్ఐపాస్తో తెలంగాణలో కొత్త పరిశ్రమలను ఆకర్షిస్తున్నారని తెలిపారు. అదే సమయంలో ఓడీఎఫ్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి పరిశ్రమలు, సంస్థలను బీజేపీ సర్కార్ ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. మంగళవారం పటాన్చెరు జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమల యాజమాన్యాలు, ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మికులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
జిల్లాలో తయారవుతున్న ఉత్పత్తులను స్టాల్స్ పెట్టి ప్రదర్శించారు. ఈ స్టాల్స్ను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కలెక్టర్ శరత్కుమార్ పరిశీలించారు. అనంతరం జిల్లాలో పారిశ్రామిక రంగంలో ప్రతిభను చాటిన వారికి అవార్డులు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం అంటేనే పరిశ్రమలకు కేంద్రం అన్నారు. తెలంగాణ సర్కార్ వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఇప్పటికే దేశంలోని పారిశ్రామికవేత్తలు కొనియాడుతున్నారన్నారు. దేశ జీడీపీ కంటే రాష్ట్ర జీడీపీ అత్యధికంగా ఉందని చెప్పారు. నిరంతర విద్యుత్ అందజేస్తుండటంతో పరిశ్రమలు ఆనందంలో ఉన్నాయన్నారు. గూడెం మహిపాల్రెడ్డిని డైనమిక్ ఎమ్మెల్యే అని కొనియాడారు.
అందరికీ ఉపాధి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఉత్తమ పారిశ్రామిక విధానంతో నూతనంగా పరిశ్రమలు రాష్ర్టానికి క్యూ కడుతున్నాయని, జిల్లాకు భారీగా పరిశ్రమలు వస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. ఎవరు వచ్చినా ఉపాధి గ్యారంటీ అన్నట్టుగా పటాన్చెరు పారిశ్రామికవాడ అభివృద్ధి చెందిందన్నారు. గతంలో కాలుష్యం ఉండేదని, ఇక్కడ కార్మికులు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. నేడు తెలంగాణ సర్కార్ తీసుకున్న చర్యలతో కాలుష్యం బాగా తగ్గిందన్నారు. దీంతో ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, ఇతర సేవారంగాల ప్రముఖులు పటాన్చెరు ప్రాంతంలో నివాసం ఉండేందుకు ముందుకు వస్తున్నారన్నారు.
గతంలో వారంలో మూడు రోజులు కరెంటు ఉండేది కాదని, ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. చక్కటి రోడ్లు, పుష్కలమైన నీటి సౌకర్యంతో పారిశ్రామికవాడలు ఏర్పాటవుతున్నాయన్నారు. కొల్లూర్, ఉస్మాన్నగర్లో ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. సుల్తాన్ఫూర్ పారిశ్రామికవాడలో మెడికల్ డివైజ్ పార్క్ వచ్చిందని, శివానగర్లో ఎల్ఈడీ పరిశ్రమలు వస్తాయన్నారు. త్వరలో ఈ పరిశ్రమలు ప్రారంభమై వేలాదిమందికి ఉపాధి లభిస్తున్నదన్నారు. స్థానికులకు ఉపాధి కల్పించాలని, సీఎస్సార్ నిధులను ఇక్కడి ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని పారిశ్రామికవేత్తలను ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, మీరు ఈ ప్రాంత అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు.
జిల్లాకు 2,572 పరిశ్రమలు వచ్చాయి: కలెక్టర్ శరత్కుమార్
రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంగారెడ్డి జిల్లాలో 2,572 నూతన పరిశ్రమలు వచ్చాయని కలెక్టర్ శరత్కుమార్ అన్నారు. జిల్లాలో 28వేల 181 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. వీటి ద్వారా 1లక్ష 88వేల 181మందికి ఉపాధి లభించిందని తెలిపారు. గతంలో 4,306 పరిశ్రమలు ఉండేవని, ఇంకా కొత్త పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. పారదర్శకమైన సింగిల్ విండో విధానంలో పర్మిషన్లు ఇస్తున్నట్లు వివరించారు. 15రోజుల్లోనే నూతన కంపెనీల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నామన్నారు. నిమ్జ్, సుల్తాన్పూర్, శివానగర్ పారిశ్రామికవాడల్లో కొత్త యూనిట్లు వస్తున్నాయన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో నూతన పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, ఈర్ల దేవానందం, ప్రవీణావిజయ్భాస్కర్రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజావెంకట్రెడ్డి, కుమార్గౌడ్, మున్సిపల్ చైర్మన్లు లలితాసోమిరెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, రోజాబాల్రెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, గూడెం మధుసూధన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కొలన్బాల్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పనగేశ్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రోత్సాహం బాగుంది
మేమిద్దరం సుల్తాన్ఫూర్ మెడికల్ డివైజ్ పార్క్లో ఎస్వీపీ టెక్నో ఇంజినీర్స్ పేరుతో పరిశ్రమను స్థాపించాం. 2020 నుంచి ఉత్పత్తులు తీస్తున్నాం. 40 మందికి ఉపాధి కల్పించాం. మహిళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నది. మేము దరఖాస్తు చేసిన వెంటనే మా కంపెనీకి అనుమతులు వచ్చాయి. మౌలిక వసతులు కల్పించారు. నాణ్యమైన కరెంట్ ఇస్తుండటంతో ఉత్పత్తి నిరంతరం సాగుతున్నది. దీంతో మాకు జిల్లాలో ఉత్తమ పరిశ్రమల అవార్డు వచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పారిశ్రామికవేత్తలుగా రాణించగలుగుతున్నాం. ఇలాంటి మంచి వాతావరణం ఉంటే మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారవుతారు.
– అనూష, విజయ, పారిశ్రామికవేత్తలు(సుల్తాన్ఫూర్)
పరిశ్రమలకు మహర్దశ
నిరంతర విద్యుత్తో పరిశ్రమలకు మహర్దశ వచ్చింది. మండు వేసవిలోనూ కోతలు లేని కరెంట్ ఇవ్వడంతో మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి జరుగుతోంది. గతంలో పవర్ హాలిడేస్తో నష్టపోయాం. పరిశ్రమలు ఒప్పుకున్న అర్డర్ను సకాలంలో ఇవ్వాలంటే విద్యుత్ తప్పకుండా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తో పాటు నీటిని సరఫరా చేస్తున్నది. పరిశ్రమలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు. పారిశ్రామికవాడలకు బస్సులు కూడా వేయడంతో కార్మికులు సకాలంలో డ్యూటీలకు వస్తున్నారు. ఇలాంటి ఉత్తమమైన పారిశ్రామికవిధానంతో కొత్త పరిశ్రమలు వస్తాయి.
– వెంకట్రాం, థర్మల్ సిస్టమ్స్ పరిశ్రమ ప్రెసిడెంట్(బొల్లారం)