జహీరాబాద్, ఏప్రిల్ 16: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తుండడంతో అందులోని నీటిని దిగువకు వదిలిపెట్టారు. దీంతో సంగారెడ్డి మంజీరాలో నీటి మట్టం తగ్గిపోయింది. న్యాల్కల్ మండలం రాఘవపూర్, రాయికోడ్ మండలం షాపూ ర్ గ్రామ శివారుల్లోని మిషన్ భగీరథ పథకం కింద సరఫరా చేసేందుకు ఇన్టెక్ వెల్కు నది నుంచి సరిపడా నీరు అందడంలేదు. నాలుగైదు రోజులుగా పంపింగ్ చేసేందుకు నీరు రాకపోవడంతో ఆయా మండలాల పరిధిలోని మిషన్ భగీరథ పథకం కింద ఫిల్డర్ బెడ్ పనిచేయడం లేదు. దీంతో న్యాల్కల్, రాయికోడ్, ఝరాసంగం, మునిపల్లి మండలాల పరిధిలోని 117 గ్రామాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరా పునరుద్ధరించేందుకు న్యాల్కల్ మండలం రాఘవపూర్, రాయికోడ్ మండలంలోని షాపూర్ శివారులోని ఇన్టెక్వెల్ వద్ద జేసీబీలతో కాల్వల తవ్వకం చేపడుతున్నారు. ఇన్టెక్వెల్ పరిధిలో పూడిక పెద్ద మొత్తంలో కూరుకుపోయింది. మంజీరాలో నీటి మట్టం తగ్గిపోవడంతో ఇన్టెక్వెల్కు నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, బురద వచ్చే అవకాశం ఉండడంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పవని సంబంధిత అధికారులు అంటున్నారు. మంజీరా నది నుంచి జేసీబీతో కాలువలను తవ్వినప్పటికీ ఇన్టెక్ వెల్కు నీరు చేరడం లేదు. ఒకవేళ మంజీరా నుంచి ఇన్టెక్వెల్ ద్వారా ఫిల్డర్బెడ్కు నీరు చేరే సమయంలో బురద చేరితే ఫిల్డర్ బెడ్లు జామ్ అయ్యే ప్రమాదం ఉంది.
ఎండల తీవ్రతో ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలు, వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే తాగునీటి ఇబ్బందులు తప్ప వు. జహీరాబాద్తో పాటు కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాలకు మునిపల్లి మండలం భూసారెడ్డిపల్లి ఫిల్టర్ బెడ్ నుంచి తాగునీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వరకు తాగునీటికి ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై గతంలో కూడా నమస్తే తెలంగాణలో కథనాలు ప్రచురితమయ్యాయి.